కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

by  |
కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ‘పాదయాత్రలో అనేక చోట్ల పాడి రైతులు వచ్చి కలిశారు. మినరల్‌ వాటర్‌ ధరకన్నా పాల ధర తక్కువ ఉందని ఆవేదన చెందారు. రైతుల కష్టాలు విన్న నేను అధికారంలోకి రాగానే అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాల సేకరణకు శ్రీకారం చుట్టాం’అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ఈ రోజు నుంచి అమలులోకి వస్తుందన్నారు.

ఈ పథకం ద్వారా జిల్లాలోని రైతులు, అక్కాచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభిస్తుంది. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, పశ్చిమగోదావరి, గుంటూరు వంటి ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. అమూల్‌ సంస్థ ప్రకాశం-245, చిత్తూరు-275, వైఎస్సార్‌ కడప-149, పశ్చిమగోదావరి-174, గుంటూరు-203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తుంది. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరించి రూ.71 కోట్లను పాడి రైతులకు చెల్లించిందని’సీఎం చెప్పుకొచ్చారు. ‘పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే అమూల్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అమూల్‌ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప విధానం అమూల్ సంస్థ చేపట్టింది. అంతేకాదు పాల బిల్లును కూడా 10రోజుల్లోనే చెల్లిస్తుంది.

అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు. ఏడాదిలో 182 రోజులు సొసైటీకి పాలు పోసిన రైతులకు బోనస్‌ కూడా ఇస్తుంది. లీటర్‌కు 50 పైసలు చొప్పున బోనస్‌ ఇస్తారు’అని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో అమూల్‌తో కలిసి ప్రారంభించిన ఈ పథకం దశల వారీగా రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. జనవరిలో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed