ఏపీలోకి స్వేచ్ఛగా రండి.. షరతులు వర్తిస్తాయి: సీఎం జగన్

by  |
ఏపీలోకి స్వేచ్ఛగా రండి.. షరతులు వర్తిస్తాయి: సీఎం జగన్
X

కొన్ని షరతులతో ఆంధ్రప్రదేశ్‌లోనికి ఎవరైనా రావచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారెవరికైనా ఏపీలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. క్వారంటైన్ క్యాంపుల్లో కచ్చితంగా ఒక అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు. సరిహద్దుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని ఆదేశించారు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకునేందుకు అక్కడికి అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు, హోటళ్లను గుర్తించి శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఏపీలో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉద్దేశించిన ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై చర్చించారు. కుదిస్తే బాగుంటుందన్న వారంతా… నగరాలు, పట్టణాల్లోని బజార్లలో నెలకొన్న రద్దీని ఎలా తగ్గించాలన్నదానిపై కసరత్తు చేశారు.

ప్రజల సంఖ్య, వారి అవసరాలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ఉన్నాయా? లేదా? చూడాలని అధికారులను ఆదేశించారు. శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేసిన తరువాత సమయ పాలనపై ఆంక్షలు విధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాలంటీర్ల సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. కరోనా బాధితులకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా ప్రభావిత ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారికి సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించాలని సీఎం వారిని ఆదేశించారు. అదే సమయంలో అనుభవాలు పంచుకునేందుకు డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలని వారికి సూచించారు. కరోనా టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచడంపై కూడా దృష్టి పెట్టాలని వారికి సూచించారు. కరోనా లక్షణాలు కనిపించి వెంటనే వారిని ఐసోలేషన్‌లో పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయం, ఆక్వా రంగాలపై దృష్టి పెట్టి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు.

కరోనా వైరస్ రోగి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని, గోప్యత కలిగిన సమాచారం వెల్లడించడం నిషేధమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కరోనా వైరస్ రోగి వివరాలు. వైద్య పరీక్షల వివరాలు వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులను సీఎం జగన్ హెచ్చరించారు.

Next Story

Most Viewed