సీఎం పర్యటన వాయిదా.. ఎన్నికలే కారణం..

by  |
సీఎం పర్యటన వాయిదా.. ఎన్నికలే కారణం..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటన వాయిదా పడింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ పర్యటనను వాయిదా వేసినట్లు డిప్యూటీ సీఎం అంజద్ భాషా తెలిపారు. దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్‌ కలాం జయంతి సందర్భంగా 11న జరిగే జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ రాష్ట్ర స్థాయి దినోత్సవం ఈ ఏడాది గుంటూరులో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఉన్న జింకానా ఆడిటోరియంలో గురువారం ఉదయం జరిగే ఈ వేడుకకు సీఎం జగన్‌ హాజరుకానున్నట్లు సీఎంవో ప్రకటించింది.

అంతేకాకుండా వేడుకల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ని సైతం ప్రభుత్వం విడుదల చేసింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో పర్యటన వాయిదా వేస్తున్నట్లు సీఎంవో ప్రకటించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం అంజద్ భాషా వెల్లడించారు. అన్ని జిల్లాల్లో మౌలానా ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని అంజద్ భాషా తెలిపారు. మైనారిటీల అభివృద్ది కోసం సబ్ ప్లాన్ తీసుకువస్తామన్నారు.

అబుల్ కలాం జయంతి సందర్భంగా ఇవ్వాల్సిన అవార్డులను ఎన్నికల కోడ్ తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి అందజేస్తారని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి అన్ని విధాలా పట్టం కట్టడానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. మైనారిటీల అభివృద్ది కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడించారు.



Next Story

Most Viewed