'నిమ్స్‌'లో ప్రారంభం కాని క్లినికల్ ట్రయల్స్

by  |
నిమ్స్‌లో ప్రారంభం కాని క్లినికల్ ట్రయల్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ కోసం వ్యాక్సిన్ తయారుచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ మంగళవారం నుంచే ‘నిమ్స్’లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉన్నా వివిధ కారణాలతో గురువారం నాటికి కూడా మొదలుపెట్టలేదు. ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో వారం పది రోజుల సమయం పట్టవచ్చని నిమ్స్ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. క్లినికల్ ట్రయల్స్ కోసం వాలంటీర్లు స్వచ్ఛందంగా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ కొన్ని ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం, మౌలిక సౌకర్యాలను సమకూర్చుకోవడం, ఇన్‌పేషెంట్లను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచడానికి తగిన వసతులను ఏర్పాటు చేయడం… లాంటి పలు అంశాలు ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. సుమారు అరవై మంది మీద క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాల సమాచారం.

పంద్రాగస్టు కల్లా ప్రక్రియ పూర్తవుతుందని ఆశలు పెట్టుకున్న ఐసీఎంఆర్‌కు రెండు దశల్లో జరిగే క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం. నిమ్స్ ఆసుపత్రిలో ఫార్మకాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభాకరెడ్డి నేతృత్వంలోని ఎథికల్ కమిటీ ఈ ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తుంది. ఆయనతో పాటు క్లినికల్ ఫార్మకాలజీ థెరప్టిక్స్ హెడ్ డాక్టర్ ఉషారాణి, జనరల్ మెడిసిన్, అనెస్థీషియా విభాగాల నుంచి డాక్టర్లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి భారత్ బయోటెక్ ఇంకా ప్రోటోకాల్ మార్గదర్శాలను రూపొందించలేదని, వాటిని నిర్వహించడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో సమకూరలేదని ఒక డాక్టర్ తెలిపారు.

క్లినికల్ ట్రయల్స్‌కు స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, వారికి రక్త పరీక్షలు నిర్వహించి కొన్ని అంశాలను సేకరించడం, వారికి స్క్రీనింగ్ నిర్వహించడం, ట్రయల్స్ గురించి వారికి వివరించడం.. ఇలాంటివేవీ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కనీసంగా వారం పది రోజుల సమయం పట్టవచ్చునని, ఆ తర్వాత ఒక డోసు ఇచ్చి రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే వారి ఆరోగ్య స్థితిలో వస్తున్న మార్పును పరిశీలించి ఆ తర్వాత మరో రెండు వారాల పాటు అధ్యయనం చేసిన తర్వాత రెండో డోసు గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఆ డాక్టర్ వివరించారు.

Next Story

Most Viewed