హుజురాబాద్@ ఈటల వర్గం VS టీఆర్ఎస్ లీడర్స్

by  |
హుజురాబాద్@ ఈటల వర్గం VS టీఆర్ఎస్ లీడర్స్
X

దిశ, హుజురాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల వర్గాలుగా ఏర్పడ్డాయి. దీంతో వీరి మధ్య వైరం ఒకరినొకరు అడ్డుకునే స్థాయికి చేరింది. తాజాగా వీణవంక మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగైదు రోజులుగా హుజురాబాద్‌లో రాజకీయాలు హీటెక్కాయి. దీంతో పోటీపడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ముఖ్యమంత్రికి అనుకూలంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్గీయులు అక్కడికి చేరుకొని కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల అండదండలతోనే ప్రెస్‌మీట్లు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, ఈటల వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు ఈటల వర్గీయులను పోలీసులు అక్కడి నుండి తరలించారు. పోటాపోటీ కార్యక్రమాలు, అధికార పక్షం, విపక్షంగా మారిన పరిస్థితులతో హుజురాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా స్పష్టం అవుతోంది. నిన్న మొన్నటి వరకు ఒకటే పార్టీలో ఉన్న నాయకులు మారిన పరిణామాలతో ఇప్పుడు మాటల యుద్ధం మొదలు పెట్టుకున్నారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

నేడు ఈటల రాక..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం హుజురాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా తన సన్నిహితులతో పాటు, తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.



Next Story

Most Viewed