మంత్రుల స్థాయి చర్చలతోనే స్పష్టత

by  |
మంత్రుల స్థాయి చర్చలతోనే స్పష్టత
X

దిశ, వెబ్‎డెస్క్ : కరోనా తగ్గుతున్న నేపథ్యంలో అన్‎లాక్ మొదలయ్యాక తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం తిరగడం లేదు. అంతరాష్ట్ర బస్సులపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు కొలిక్కి రాలేదు. ఏపీ అధికారులు కిలోమీటర్లు తగ్గించుకోవాలంటూ తెలంగాణ అధికారులు.. తగ్గించబోమంటూ ఏపీ అధికారుల వాదనలతో సాగిన చర్చలు విఫలమయ్యాయి.

ఈ సందర్భంగా ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ.. మంత్రుల స్థాయి చర్చలతోనే అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై స్పష్టత వస్తుందన్నారు. ఇరు రాష్ట్రాలు లక్షా 60 వేల కిలోమీటర్లు తిప్పుదామని తెలంగాణ ఆర్టీసీ అంటోందని, ఏపీ తిప్పుతున్న లక్షా 10 వేల కిలోమీటర్ల దగ్గరే ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. లక్షా 10 వేల కిలోమీటర్లు బస్సులు తగ్గించండని తెలంగాణ ఆర్టీసీ చెబుతోందన్నారు. అయితే తాము తగ్గిస్తాం.. మీరు పెంచండి అంటే తెలంగాణ కుదరదంటోందని వెల్లడించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు తగ్గిస్తే ప్రైవేట్ ట్రావెల్స్‌కి లబ్ధి చేకూతుందన్నారు. తాము లక్ష 10 వేల కిలోమీటర్లు తగ్గిస్తే ప్రైవేట్ బస్సులు పెరుగుతాయని, లక్ష 60 వేల కిలోమీటర్లు తిప్పటానికి తాము సిద్ధమని చెప్పామన్నారు. ఆర్టీసీకి దసరా సమయం కీలకం కావడంతో అది తేలే వరకు ముందుగా 70 వేల కిలోమీటర్లు తిప్పుదామని ప్రతిపాదన పెట్టామన్నారు. ప్రతిపాదనపై టీఎస్‌ ఆర్టీసీ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదని కృష్ణబాబు తెలిపారు.

Next Story

Most Viewed