ముంబై పోలీసులకు.. పిక్టోరియల్ ట్రిబ్యూట్

by  |
ముంబై పోలీసులకు.. పిక్టోరియల్ ట్రిబ్యూట్
X

దిశ, ఫీచర్స్: కొవిడ్ -19 మహమ్మారి విజృంభించిన తరుణంలో ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’గా పోలీసులు చేసిన కృషి మరవలేనిది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదు కాగా, అక్కడ గరిష్ట సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో భయంకరమైన వైరస్‌‌కు, పౌరులకు మధ్య బలమైన నిరోధంగా నిలిచిన ముంబై పోలీస్ ఫోర్స్‌ను గౌరవిస్తూ.. ముంబై ఫొటోగ్రాఫర్ ప్రవీణ్ తలాన్ తన క్యాలెండర్ ద్వారా పిక్టోరియల్ ట్రిబ్యూట్ ఇచ్చాడు.

కొవిడ్ సమయంలో పోలీసులు నిద్రాహారాలు, సెలవులు మానుకుని మరీ విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ప్రతి క్షణం ఎంతో అలర్ట్‌గా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా వారికి అవసరమైన నిత్యావసరాలను అందించడం, కరోనా హాట్ స్పాట్‌లో పర్యటించడం నుంచి లాక్‌డౌన్ వేళ ప్రజలెవరూ బయట తిరగకుండా గస్తీ కాసే వరకు అలుపెరగకుండా పనిచేశారు. కష్ట సమయంలో పోలీసులు నిర్వర్తించిన ఆయా బాధ్యతలను తన కెమెరాలో బంధించిన స్థానిక ఫొటోగ్రాఫర్ ప్రవీణ్.. ఆ భావోద్వేగ చిత్రాలను క్యాలెండర్ రూపంలో అందించి పోలీసులకు ఘనంగా ట్రిబ్యూట్ పలికాడు.

‘కొవిడ్ 19 భయం అందరిలోనూ ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే సైకలాజికల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే మనకు బిగ్ చాలెంజ్. కరోనా వేళ బయటకు వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు నాలో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు రేకెత్తాయి. పాండమిక్‌లో మన చుట్టూరా జరుగుతున్న సంఘటనలను కవర్ చేయడానికి నేను జర్నలిస్ట్ కాదు, హెల్త్ వర్కర్‌ను కాదు. ఇంకా చెప్పాలంటే కరోనా వారియర్‌ను కూడా కాదు. కానీ ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం. అందుకే ఆ సంఘటనలను నా వర్క్ ద్వారా డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. నాకు పోలీసులు ఎంతో సహకరించారు. అవసరమైన ప్రతిచోటా నన్ను అనుమతించి నా పనికి గౌరవమిచ్చారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసు సిబ్బంది విధుల్లో నిర్వర్తించిన వివిధ కోణాలను నేను క్యాప్చర్ చేశాను. అందులో కొన్నింటిని ఇలా క్యాలెండర్ రూపంలో తీసుకు వచ్చాను. ఈ క్యాలెండర్ పోలీసులకు అంకితమిస్తున్నాను. నా కంట్రిబ్యూషన్‌ను గుర్తించి.. ముంబై పోలీసుల తరఫున ముఖ్యమంత్రి ఉద్దవ్ బాలసాహెబ్ థాకరే నన్ను సత్కరించడం నా జీవితంలో మరిచిపోలేని క్షణం’ అని ప్రవీణ్ పేర్కొన్నాడు.


Next Story

Most Viewed