సిటీ బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయంటే..?

by  |
సిటీ బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయంటే..?
X

దిశ, న్యూస్‌బ్యూరో : అన్‌లాక్‌లో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు, అర్బన్ లోకల్ బస్సు సర్వీసులకు ఎప్పటి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణ ఆర్టీసీ కూడా అప్పటి నుంచే హైదరాబాద్‌లో సిటీ బస్సులను రోడ్డెక్కించే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో, సిటీ బస్సులపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారమే ముందుకెళ్లాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కరోనా నిరోధానికి విధించిన పూర్తిస్థాయి లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే నెల చివరి వారం నుంచి రాష్ట్రంలోని జిల్లాల్లో, రాజధాని హైదరాబాద్, జిల్లాల మధ్య బస్సులు రోడ్డెక్కినప్పటికీ హైదరాబాద్‌లో సిటీ లోకల్ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం కాలేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడం, వాటిలో ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే నమోదవుతుండడంతో సిటీ బస్సులు ప్రారంభించడానికి అప్పట్లో ఆర్టీసీపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా కరోనా కొత్త కేసుల నమోదు ఏ మాత్రం తగ్గకపోవడంతో సిటీ బస్సులు ప్రారంభించే ఆలోచనే ఆర్టీసీ అధికారులు చేయలేదు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు, ఇతర ప్రత్యేక అవసరాలకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుపుతోంది.

ఏపీఎస్ఆర్టీసీతో చర్చలు..

మరో పక్క అంతర్రాష్ట్ర సర్వీసుల విషయానికి వస్తే తెలంగాణ ఆర్టీసీ పక్కన తెలుగు రాష్ట్రానికి చెందిన ఏపీఎస్‌ఆర్టీసీతోనే ప్రధానంగా చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. చర్చల ఎజెండాను కూడా టీఎస్‌ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బస్సులు తెలంగాణలో లక్ష కిలోమీటర్ల దాకా తిరుగుతున్నందున తాము కూడా అంతే దూరం ఆ రాష్ట్రంలో బస్సులు తిప్పడమే చర్చల్లో తమ ప్రధాన డిమాండ్ అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాలకు బార్డర్ పన్ను సమస్య ఉండదని, సింగిల్ పాయింట్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేసుకోవచ్చనేది వారి వాదన. ఈ పద్ధతిలో ఏ రాష్ట్ర ఆర్టీసీ ఆ రాష్ట్రంలోనే పన్ను చెల్లించుకుంటే సరిపోతుందని వారు అంటున్నారు. లేదంటే ఏపీ తెలంగాణకు ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావడం, తెలంగాణ ఏపీకి తక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. సింగిల్ పాయింట్ సరిహద్దు పన్ను విధానంలో సమాన దూరం తిప్పడానికి అంగీకరిస్తేనే తాము ఏపీతో అంతర్రాష్ట్ర సర్వీసులతో ఒప్పందం చేసుకుంటామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెగేసి చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఏపీతో ఈ విషయమై ఒప్పందం చేసుకోవడానికిగానూ జూన్ నెలలోనే రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఏపీ వెళ్లి అక్కడి ఆర్టీసీ అధికారులతో విజయవాడలో ఈ విషయమై చర్చించి వచ్చారు. అయితే రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లో జరగాల్సిన రెండో విడత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు చర్చలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.


Next Story

Most Viewed