అక్షయపాత్ర పేరుతో ప్రైవేటుకు అప్పజెప్పడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువు..

by  |
అక్షయపాత్ర పేరుతో ప్రైవేటుకు అప్పజెప్పడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువు..
X

దిశ, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. మరొకవైపు కరోనా కష్టకాలం నుంచి పాఠశాలల మూతపడి మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో వంట గదులు సరిగ్గా లేక వండటానికి సరైన సామాగ్రి లేకున్నా.. విద్యార్థుల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం నుంచి బిల్లులు రాకున్నా.. సొంత ఖర్చులతో వంట చేసి పెడుతున్నారని ఆయన అన్నారు. మరొకవైపు మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించకుండా అక్షయపాత్ర పేరుతో ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పడం వల్ల విద్యార్థులు నాణ్యమైన తిండి తిన లేకపోతున్నారని పేర్కొన్నారు. తమిళనాడు కేరళ తరహాలో మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు నిర్ణయించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ మధ్యాహ్న భోజన కార్మికులు రామకృష్ణమ్మ, కృష్ణయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed