బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమించనున్న సిటీబ్యాంక్

by  |
బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమించనున్న సిటీబ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కార్యకలాపాల వ్యూహంలో భాగంగా భారత్‌లో బ్యాంకింగ్ వ్యాపారం నుంచి వైదొలగనున్నట్టు అమెరికాకు చెందిన దిగ్గజం సిటీబ్యాంక్ గురువారం ప్రకటించింది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్, రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు సహా ఇతర కార్యకలాపాల నుంచి వైదొలగాలని బ్యాంక్ నిర్ణయించింది. ప్రస్తుతం సిటీబ్యాంకు దేశవ్యాప్తంగా 35 శాఖలను నిర్వహిస్తోంది. సుమారు 4,000 మంది ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు. సిటీబ్యాంకు 13 దేశాల్లో బ్యాంకింగ్ వ్యాపారాల నుంచి నిష్క్రమించనున్నట్టు బ్యాంక్ గ్లోబల్ సీఈఓ జేన్ ఫ్రేజర్ చెప్పారు. కాగా, వినియోగదారుల బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ‘ఈ ప్రకటన వల్ల ప్రస్తుతం సంస్థ కార్యకలాపాలపై తక్షణ మార్పులేమీ ఉండవు. ఉద్యోగులపై కూడా ప్రభావం ఉండదని, ఇప్పటివరకు అందిస్తున్న నిబద్ధత, అంకితభావంతో వినియోగదారులకు సేవలను అందిస్తామని’ సిటీబ్యాంక్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశు ఖుల్లార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా సంస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. కాగా, సిటీబ్యాంక్ భారత్‌లో 1985 నుంచి బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.


Next Story