26 ఏళ్ల పూరి ప్రస్థానంపై విజయ్ సేతుపతి ఆసక్తికర పోస్ట్

by Pulgam srinivas |   (  Updated:2026-04-20 06:45:02  IST  )

దర్శకుడు పూరి జగన్నాథ్ సినీ పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ్ సేతుపతి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

26 ఏళ్ల పూరి ప్రస్థానంపై విజయ్ సేతుపతి ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ చిత్రం 2000 సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైంది. ఈ మూవీ విడుదలై నేటికి 26 సంవత్సరాలు పూర్తవడంతో, పూరి జగన్నాథ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లైంది. ఈ సందర్భంగా అనేకమంది సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్, ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినీ పరిశ్రమలో 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన 'X' ఖాతా ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

సినీ పరిశ్రమలో 26 ఏళ్ల ప్రయాణం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాకుండా, ధైర్యం, నమ్మకం మరియు భయంలేని స్వరంతో నిర్మించుకున్న గొప్ప వారసత్వమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. ఇదే సందర్భంగా, పూరి జగన్నాథ్‌తో కలిసి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ సినిమాలో పని చేసిన అనుభవాన్ని కూడా ఈ నటుడు గుర్తు చేసుకున్నారు. నటులుగా తమపై నమ్మకం ఉంచి, కంఫర్ట్ జోన్‌ను దాటి మరింత మెరుగైన నటన చూపించేలా ప్రోత్సహించే దర్శకులు చాలా అరుదుగా ఉంటారని, ఆ విషయంలో పూరి జగన్నాథ్ ప్రత్యేకమైన వ్యక్తి అని తెలిపారు. అలాగే, ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రం తమ అందరికీ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందని విజయ్ సేతుపతి ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా పూరి జగన్నాథ్ మరెన్నో విజయాలు సాధిస్తూ ప్రభావవంతమైన కథలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటూ ఆయనకు గౌరవాభివందనాలు తెలిపారు. విజయ్ సేతుపతి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.+

Next Story