Labor Commission: లేబర్‌ కమిషనర్‌ దగ్గరకు టాలీవుడ్‌ పంచాయితీ..

by Ramesh Naini |   (  Updated:2025-08-05 10:56:48  IST  )

సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు.

Labor Commission: లేబర్‌ కమిషనర్‌ దగ్గరకు టాలీవుడ్‌ పంచాయితీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో (Film Federation) ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Producers Council) మధ్య చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. నిన్న సాయంత్రం వరకు నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఇవాళ కూడా రెండు గంటల పాటు నిర్మాతల సమావేశం కొనసాగింది. వేతనాలు పెంచాల్సిందేనని సినీ కార్మికులు పట్టుబట్టారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్‌కి వస్తామని కార్మికులు బెదిరింపునకు దిగారు. ఈ బెదిరింపులకు తాము భయపడబోమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. 30 శాతం వేతనాలు పెంచడం అనేది అసాధ్యమని.. నిర్మాతలు తేల్చిచెప్పారు. దీంతో ఈ టాలీవుడ్‌ పంచాయితీ లేబర్‌ కమిషనర్‌ దగ్గరకు చేరింది. 30శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు లేబర్‌ కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లారు. ఈ మేరకు నిర్మాతలతో లేబర్‌ కమిషనర్‌ (Labour Commissioner) మరోసారి చర్చలు జరపనున్నట్లు సమాచారం. సాయంత్రం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

కాగా, కార్మికులతో సూదీర్ఘ చర్చల అనంతరం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్‌ఛాంబర్‌తోనే మా అసోషియేషన్‌ ఉంటుందని, ఛాంబర్‌ ప్రతినిధులతో మంచు విష్ణు చర్చలు జరిపారని తెలిపారు. అలాగే సినీ కార్మికులకు తాము ఎప్పుడు అండగా ఉంటామని, ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారని వివరించారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకంటే ఎక్కువగా కార్మికుల జీతాలిస్తున్నామని, కార్మికులు ఫిల్మ్‌ ఛాంబర్‌తో కలిసివస్తారని ఆశిస్తున్నామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story