రాత్రింబవళ్ళు కష్టపడే ఆ లక్షలాది మంది సిబ్బందికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు: కంగనా రనౌత్

by Mallepaka Hamsa |

మన సమాజంలో నర్సింగ్ వృత్తిని చాలా తక్కువ చేసి చూస్తారు. నిజం చెప్పాలంటే, దాన్ని ఒక గ్లామర్ వృత్తిగా మార్చేశారు.

రాత్రింబవళ్ళు కష్టపడే ఆ లక్షలాది మంది సిబ్బందికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు: కంగనా రనౌత్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భారత్ భాగ్య విధాత’. ఈ సినిమా 2008 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించగా.. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్ ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. సమాజంలో నర్సులు, హెల్త్‌కేర్ సిబ్బందిని చూసే విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సుల పట్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని కోరారు.

"మన సమాజంలో నర్సింగ్ వృత్తిని చాలా తక్కువ చేసి చూస్తారు. నిజం చెప్పాలంటే, దాన్ని ఒక గ్లామర్ వృత్తిగా మార్చేశారు. హాస్పిటల్‌కు వస్తే నర్సులతో కాసేపు టైమ్‌పాస్ మాట్లాడొచ్చు అనే చులకన భావం చాలామందిలో ఉంది. మా సినిమాలో కూడా దీనిపై ఒక డైలాగ్ ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. మనం హాస్పిటల్ అనగానే కేవలం డాక్టర్ల గురించే ఆలోచిస్తామని, కానీ రోగులను శుభ్రం చేయడం నుండి హాస్పిటల్‌ను నడపడం వరకు ప్రతి పనినీ నర్సులే చూసుకుంటారని కంగనా గుర్తుచేశారు. రాత్రింబవళ్ళు కష్టపడే ఆ లక్షలాది మంది సిబ్బందికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని అన్నారు. ఈ సినిమా చూశాకైనా నర్సుల పట్ల ప్రజల చూపులో కొంచెం మార్పు వచ్చినా, తమ ప్రయత్నం విజయవంతమైనట్లేనని కంగనా రనౌత్ తెలిపారు.

Next Story