ఆ ప్రముఖ సంస్థ చేతికి 'చేతబడి' ఆడియో హక్కులు

by Pulgam srinivas |

'చేతబడి' చిత్రానికి సంబంధించిన ఐదు భాషల ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ ‘సరిగమ’ దక్కించుకుంది.

ఆ ప్రముఖ సంస్థ చేతికి చేతబడి ఆడియో హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన జేడీ చక్రవర్తి ప్రస్తుతం ‘చేతబడి’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. బాణామతి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేయగా, అది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని ఎం3 మీడియా మరియు మహా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల సమర్పణలో, మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సూర్యాస్ కథను అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.

సంగీతాన్ని అచ్చు రాజమణి సమకూరుస్తుండగా, పాటలకు ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను మిర్లాన్ నజీర్ నిర్వహిస్తుండగా, ఎడిటర్‌గా వంశీ పని చేస్తున్నారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్‌గా ఆశిష్ తేజ పూలల పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జీకే మీడియా (గణేష్ – కుమార్) పిఆర్‌ఓలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకులు సస్పెన్స్, హర్రర్ జానర్ చిత్రాలకు మంచి ఆదరణ చూపుతున్న సంగతి తెలిసిందే. అదే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం కావడం, జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కనిపించనున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ పెరిగిన క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమా ఐదు భాషల ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ సరిగమ భారీ ధరకు దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Next Story