రామ్ చరణ్ పై ప్రధాని ప్రశంసలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్!

by Malleboina Mahesh |   (  Updated:2026-06-24 06:59:24  IST  )

రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” అని ప్రధాని మోదీ ప్రశంసించడంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. తండ్రిగా గర్వపడుతున్నానంటూ ట్వీట్!

రామ్ చరణ్ పై ప్రధాని ప్రశంసలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) పై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎక్స్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయన సుమతీ శతకంలోని ప్రసిద్ధ పద్యం “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అన్న సూక్తిని నిజం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” (New Age MegaStar) అని సంబోధించడం పట్ల చిరంజీవి తన సంతోషాన్ని, ఒక తండ్రిగా తనకు కలిగిన గర్వాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఇలాంటి అత్యున్నత, ప్రతిష్ఠాత్మక వేదికలపై తన కుమారుడు రామ్ చరణ్‌కు లభిస్తున్న అపూర్వ గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గుండె గర్వంతో నిండిపోతుందని చిరంజీవి పేర్కొన్నారు. చరణ్ తన నిరంతర కృషి, అంకితభావం, అద్భుత నటనతో కేవలం ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అగ్రనేతల నుంచి సైతం విశేషమైన ప్రశంసలు సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమన్నారు. రామ్ చరణ్ భవిష్యత్తులో ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ మెగా పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Next Story