రివ్యూలు సినిమాలను దెబ్బతీస్తాయని నేను అనుకోను.. వడ్డే నవీన్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఒక క్వాలిటీ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేరకుండా ఏ రివ్యూ కూడా ఆపలేదు. రివ్యూలు చిత్రాలను దెబ్బతీస్తాయని నేను అనుకోను.

రివ్యూలు సినిమాలను దెబ్బతీస్తాయని నేను అనుకోను.. వడ్డే నవీన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు వడ్డే నవీన్ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇందులో వడ్డే నవీన్ సరసన రాశి సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా శిల్పా తులస్కర్, వివేక్, రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, దేవి ప్రసాద్, బాబ బాస్కర్ కీలక పాత్రలో నటించగా.. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో వడ్డే నవీన్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. గత కొద్ది కాలంగా ప్రేక్షకుల రివ్యూస్ వల్ల తమకు ఫ్లాప్ వస్తుందని భావిస్తున్న దర్శకనిర్మాతల వాదనను వడ్డే నవీన్ కొట్టిపారేశారు. రివ్యూలు ఎప్పుడూ సినిమాలను దెబ్బతీయలేవని, ప్రేక్షకుడి నోటి మాట మాత్రమే అన్నింటికంటే అత్యంత శక్తివంతమైనదని అన్నాడు.

‘‘ఒక క్వాలిటీ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేరకుండా ఏ రివ్యూ కూడా ఆపలేదు. రివ్యూలు చిత్రాలను దెబ్బతీస్తాయని నేను అనుకోను. ఒకప్పుడు కూడా క్వాలిటీతో తీస్తేనే ఆడాయి.. లేదంటే రెండో రోజుకే థియేటర్ల నుండి వెళ్ళిపోయేవి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, కథలో బలం లేకపోతే జనాలు కేవలం ఒక వారం రోజులు మాత్రమే చూసేవారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా వేగంగా మారిపోవడం వల్ల చిత్రం రిజల్ట్ ఏంటనేది క్షణాల్లో తెలిసిపోతోంది. గతంలో లాగా వారం రోజుల వరకు ఆగాల్సిన అవసరం లేకుండా.. ఇప్పుడు కేవలం రెండో షో సమయానికే థియేటర్లలో జనాలు ఉండటం లేదు. సినిమా గనుక ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటే అది ఎప్పటికీ ఫ్లాప్ కాదు. వాళ్లకు గనుక నచ్చకపోతే మనం ఎంత ప్రమోషన్ చేసినా, ఏం చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు’’ అని వడ్డే నవీన్ స్పష్టం చేశాడు.

Next Story