విజయ్‌కి ‘కైలాసం’ దీవెనలు.. రంజిత అధికారిక ప్రకటన

by Bhoopathi Nagaiah |

తమిళనాడులో అధికారం చేపట్టబోతున్న విజయ్‌కి స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి, ఆయన శిష్యురాలు రంజిత అభినందనలు తెలిపారు.

విజయ్‌కి ‘కైలాసం’ దీవెనలు.. రంజిత అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో, పరారీలో ఉన్న నిత్యానంద స్థాపించిన ‘కైలాస’ దేశం నుండి ఒక ఆసక్తికర ప్రకటన వెలువడింది. స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి శిష్యురాలు, ఒకప్పుడు వెండితెరపై మెరిసిన నటి రంజిత (ప్రస్తుత పేరు మా నిత్యానందమయి) విజయ్‌కు అభినందనలు తెలుపుతూ విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రంజిత ట్వీట్‌లో ఏముందంటే..

ఆమె చేసిన ట్వీట్‌లో ‘ది సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూయిజం’ జగద్గురు భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం తరపున విజయ్‌కు, ఆయన పార్టీకి నిత్యనంద స్వామి ప్రత్యేక అభినందనలు తెలిపినట్టు పేర్కొన్నారు. అలాగే తమిళనాడులో ఏర్పాటు కాబోతున్న విజయ్ ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రజలకు నిత్యానంద స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. తమిళనాడు ప్రజలు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అత్యంత స్పష్టమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రంజిత తెలిపారు.

రాజకీయ ప్రాధాన్యత

చాలా కాలంగా వార్తలకు దూరంగా ఉన్న రంజిత, ఒక్కసారిగా కైలాసం ప్రధానమంత్రి హోదాలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. నిత్యానంద శిష్యురాలిగా మారిన తర్వాత ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె నిత్యానంద స్థాపించిన వర్చువల్ దేశం 'కైలాసం' వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. అయితే, వివాదాస్పద గురువుగా ముద్రపడ్డ నిత్యానంద నుంచి విజయ్‌కు మద్దతు లభించడంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ తన ప్రచారంలో 'లౌకికవాదం' గురించి మాట్లాడినప్పటికీ, ఇలాంటి మద్దతు సందేశాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.

Next Story