బన్నీపై 42 కఠిన నిబంధనలు? బ్రాండ్ స్ట్రాటజర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అల్లు అర్జున్ టీమ్

by Ramesh Naini |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రవర్తన, షూటింగ్ సెట్స్‌లో ఆయన అనుసరించే ప్రోటోకాల్‌పై బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బన్నీపై 42 కఠిన నిబంధనలు? బ్రాండ్ స్ట్రాటజర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అల్లు అర్జున్ టీమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రవర్తన, షూటింగ్ సెట్స్‌లో ఆయన అనుసరించే ప్రోటోకాల్‌పై బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రకాల కఠిన నిబంధనలు ఉంటాయంటూ ఆమె చేసిన ఆరోపణలను బన్నీ టీమ్ కొట్టిపారేసింది.

వివాదానికి కారణం ఏమిటి?

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావేరీ బారువా, అల్లు అర్జున్‌తో కలిసి ఒక ప్రకటన (Ad Film) షూటింగ్ చేసినప్పటి అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఎదురైన పరిస్థితులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు మేనేజర్లు 42 నిబంధనలతో కూడిన జాబితాను ఇస్తారని, అవి చాలా కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. హీరో కళ్లలోకి నేరుగా చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, తగినంత దూరం పాటించాలనే నిబంధనలు ఉంటాయని ఆమె ఆరోపణలు చేశారు. షూటింగ్ సెట్‌లో హీరో ఉన్నప్పుడు ఫోన్ వాడకూడదనే నిబంధన ఉందని, తాను ఫోన్ చూస్తుంటే బాడీగార్డ్ వచ్చి తన చేతిలో నుంచి ఫోన్‌ను లాగేసుకున్నాడని ఆమె ఆరోపించారు.

స్పందించిన అల్లు అర్జున్ టీమ్..

ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించింది. కావేరీ బారువా చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారు. ఆయనతో పనిచేసిన దర్శకులు, బ్రాండ్ ప్రతినిధులు, కో-ఆర్టిస్టులు ఎందరో ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. కేవలం ప్రచారం కోసం లేదా వ్యక్తిగత కారణాలతోనో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు’ అని టీమ్ పేర్కొంది. అల్లు అర్జున్‌పై తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. వీటికి బాధ్యులైన వారిపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీమ్ సిద్ధంగా ఉందని, నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని ప్రచారం చేయొద్దని స్పష్టంగా పేర్కొంది.

Next Story