తగ్గిన మారుతి సుజుకి కార్ల ఉత్పత్తి.. కారణం ఇదే!

by  |
తగ్గిన మారుతి సుజుకి కార్ల ఉత్పత్తి.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఆగష్టులో చిప్‌ల కొరత కారణంగా 8 శాతం ఉత్పత్తిని తగ్గించినట్టు వెల్లడించింది. వాహనాల తయారీలో కీలకమైన చిప్ కొరత వల్ల కేవలం 1,13,937 కార్లను మాత్రమే ఉత్పత్తి చేశామని, గతేడాది ఇదే నెలలో 1,23,796 వాహనాలను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత ఆగష్టులో భారీగా ఉత్పత్తిని తగ్గిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. బడ్జెట్ రేంజ్ కార్ల మోడళ్లు ఆల్టో, ఎస్-ప్రెసో తయారీలో సుమారు 2,000 వాహనాల ఉత్పత్తి తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఇతర విభాగాల్లో వేగన్ ఆర్, స్విఫ్ట్, బలెనో, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్ కార్ల ఉత్పత్తి కూడా స్వల్పంగా తగ్గిందని, అయితే, ఎర్టిగా, ఎక్స్ఎల్6, ఎస్-క్రాస్ వంటి ఎస్‌యూవీ మోడళ్ల ఉత్పత్తి 9,000 ఎక్కువగా పెరిగినట్టు కంపెనీ వివరించింది.

గత కొన్ని నెలలుగా బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వ్యవస్థలను కార్లలో అందిస్తుండటంతో ఆటో పరిశ్రమలో చిప్‌లకు డిమాండ్ అత్యధికంగా పెరిగింది. ఇది అంతర్జాతీయంగా కూడా ఇదే స్థాయిలో ఉండటంతో ఆటో కంపెనీలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దేశీయంగా అత్యధిక మార్కెట్ కలిగిన మారుతీ సుజుకి చిప్‌ల కొరతతో సతమతమవుతోంది. కంపెనీ ఇప్పటికే సెమీకండక్టర్ల కొరత కారణంగా పలు తయారీ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించింది. కర్మాగారాల్లోని కొన్ని తయారీ లైన్లలో ఉత్పత్తిని ఒక షిఫ్ట్‌కు తగ్గించింది. మారుతీ సుజుకి బాటలోనే మరికొన్ని కంపెనీలు సైతం ఈ సమస్యను అధిగమించేందుకు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.


Next Story