స్కూలు ఫీజుకు డబ్బులివ్వమంటున్న చిన్మయి

by  |
స్కూలు ఫీజుకు డబ్బులివ్వమంటున్న చిన్మయి
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్ర‌ముఖ‌ గాయ‌ని చిన్మ‌యి శ్రీపాద.. గాత్రమే కాదు, మనసు కూడా తియ్యనిదే. ఆపదలో ఉన్నవాళ్లకు వీలైనంత మేరకు హెల్ప్ చేస్తుంటుంది. ఇటీవలే కొవిడ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. అభిమానుల కోసం పాట‌లు పాడుతూ, శుభాకాంక్ష‌లు చెప్తూ 82 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా సేక‌రించారు. ఏప్రిల్‌లో మొదలుపెట్టి, సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగించిన చిన్మయి.. ఈ విరాళాలం కోసం మొత్తంగా మూడు వేల పాటలు పాడింది. తాజాగా.. మరో మంచి పని కోసం ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది.

ఐదుగురు విద్యార్థులకు ఫీజులు కట్టేందుకు మనీ కావాలని.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఐదుగురిలో ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరో ఇద్దరు కజిన్స్, ఒక ఇండివిడ్యువల్ విద్యార్థి ఉన్నారు. వీళ్లంతా మూడు భిన్నమైన స్కూళ్లలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వీళ్ల చదువు కొనసాగాలంటే.. ఫీజులు చెల్లించాలని కోరింది చిన్మయి. ఒకవేళ ఎవరైనా మంచి మనసుతో ముందుకొచ్చి ఫీజు చెల్లిస్తే.. వారికి ఫీజు కట్టిన రశీదులను సెండ్ చేస్తామని ఆ పోస్ట్‌లో తెలిపింది.

అయితే, ఫీజుకు ఎన్ని డబ్బులు అవసరం? ఎలా పంపించాలి? లాంటి వివరాలేమీ తెలపలేదు. దీంతో ఆ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు.. ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు.

Next Story