తన పెళ్లి ఆపమన్న పెళ్లికూతురు.. అభినందించిన అధికారులు

by  |
తన పెళ్లి ఆపమన్న పెళ్లికూతురు.. అభినందించిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఆడపిల్లలకు బాల్య వివాహాలను చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలు తలపెట్టినా ఎక్కడో ఒక చోట ఈ బాల్య వివాహాలకు ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు. తల్లిదండ్రులను ఎదిరించే దైర్యం లేక మౌనంగా తలవంచి తాళి కట్టించుకుంటున్నారు. కానీ తాజాగా ఓ బాలిక మాత్రం తన బాల్య వివాహాన్ని తానే దైర్యంగా ఆపుకొంది. తల్లిదండ్రులు తన మాట వినకపోయేసరికి దైర్యంగా చైల్డ్‌లైన్‌ అధికారులకు ఫోన్ చేసి చెప్పి తన వివాహాన్ని రద్దు చేయించింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే ..

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోండగా.. ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారు పెద్దలు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని, ఉన్నత చదువులు చదువుకోవాలని కోరుకొంటునట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. అవేమి పట్టించుకోని తల్లిదండ్రులు బాలికను బెదిరించి పెళ్ళికి ఒప్పించారు. దీంతో తన పెళ్లిని ఎలా ఆపాలో తెలియని బాలిక చైల్డ్‌లైన్‌ 1098 నెంబర్ కి ఫోన్ చేసి అధికారులకు విషయం మొత్తం చెప్పింది. తన పెళ్లిని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రాధేయపడింది. సమాచారం అందుకున్న అధికారులు బాలిక పెళ్లి జరుగుతున్నఇంటికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మైనార్టీ తీరాకే పెళ్లి చేస్తామని వారి నుంచి హామీపత్రం రాయించుకుని, ధైర్యంగా సమాచారం ఇచ్చినందుకు బాలికకు సన్మానం చేశారు.

Next Story

Most Viewed