ఎమ్మెల్సీ ఎన్నికలపై శశాంక్‌ గోయల్ కీలక ఆదేశాలు

by  |
ఎమ్మెల్సీ ఎన్నికలపై శశాంక్‌ గోయల్ కీలక ఆదేశాలు
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ (డిసెంబర్ 10న జరగనున్న ఎన్నికలు)ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించాలని తెలిపారు.

ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని అన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డులలో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. ఇక 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్‌టీసీ ఆర్ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed