కిలో చికెన్ రూ.200

by  |
కిలో చికెన్ రూ.200
X

దిశ, న‌ల్ల‌గొండ‌: కరోనా ప్రబలేందుకు చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఏవీ కారణం కావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో చికెన్‌పై అపోహలు తొలగాయి. చికెన్ దుకాణాల ఎదుట జ‌నాలు క్యూ క‌డుతున్నారు. దీంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. రెండ్రోజుల్లోనే చికెన్ ధ‌ర‌లు ఎగ‌బాకాయి.

న‌ల్ల‌గొండ‌, సూర్య‌పేట‌, యాదాద్రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో కిలో చికెన్ ధ‌ర రూ.200లు దాట‌డంతో కొనుగోలు దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల ప్రారంభం వరకు స్కిన్‌లెస్‌ చికెన్ ధ‌ర‌ రూ.180 పైన ఉన్న‌ది. కరోనా వ్యాప్తి వదంతులతో భారీగా పడిపోయింది. జిల్లాలోని పదిరోజుల కిందట స్కిన్‌లె స్‌ చికెన్‌ ధర కిలోకు రూ.30 నుంచి రూ.35 వరకు పడిపోయిన విషయం విదితమే. విత్‌ స్కిన్ చికెన్ ధ‌ర రూ.100కు నాలుగు కిలోల చొప్పున విక్ర‌యించిన‌ప్ప‌టికీ క‌రోనా భ‌యంతో తిన‌డానికి జ‌నాలు ముందుకు రాలేదు. దీంతో పౌల్ర్టీ రైతుల‌కు దాణా ఖ‌ర్చులు పెరిగిపోతున్న క్ర‌మంలో న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావించి కోళ్లను ఫ్రీగా పంచి పెట్టారు. యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని రాజ‌పేట‌, భువ‌న‌గిరి, తుర్క‌ప‌ల్లి, సూర్య‌పేట‌ జిల్లాలోని మ‌ఠంప‌ల్లి, కోదాడ‌, న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు, దేవ‌రకొండ‌, చిట్యాల‌, నార్కెట్‌ప‌ల్లి, క‌ట్టంగూరు, న‌ల్ల‌గొండ త‌దిత‌ర మండ‌లాల్లో దాణా ఖ‌ర్చుల‌నే సేవ్ చేసుకోవ‌డానికి ఉత్ప‌త్తిదారులు ఈనిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు. అయితే, వారం నుంచి తిరిగి వీరికి మంచి రోజులు వ‌స్తోన్నాయి.

జిల్లాలోని భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, కోదాడ‌, సూర్య‌పేట త‌దిత‌ర ప్రాంతాల్లో ఐదు రోజుల కిందట కిలో చికెన్‌ ధర రూ.104 నుంచి రూ.110కు ఉండగా, మరికొన్ని దుకాణాల్లో కిలో రూ.120 వరకు విక్రయించారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. పాతాళంలోకి పడిపోయిన చికెన్‌ ధరలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండటంతో పెంపకం దారుల్లో కొంత భరోసా ఏర్పడింది. రెండ్రోజుల కిందట ఫారం గేటు వద్ద లైవ్‌ బాయిలర్‌ కోడికిలో ధర రూ.50 ఉండగా, అది రూ.60లకు చేరుకుంటుంది. ఈ ధరలు రెండు, మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫారం గేట్‌ ధర కిలోకు రూ. 75 నుంచి రూ.80కి చేరవచ్చని దుకాణదారులు అంచనా వేస్తున్నారు. ఫారాల వద్ద లైవ్‌ బ్రాయిలర్‌ కోళ్లు కిలోకు రూ. 60వంతున ట్రేడర్స్‌ లిప్టింగ్‌ చేసి దుకాణదారులకు కిలోకు అదనంగా పది రూపాయలు పెంచి డంప్‌ చేస్తున్నారు. దీంతో దుకాణదారులు రిటైల్‌గా కిలో ధర రూ.120లకు విక్రయిస్తున్నారు.

మటన్ ధరలు పెరిగాయి..

నాలుగైదు రోజుల నుంచి మ‌ట‌న్ ధ‌ర కిలోకు రూ.200 పెంచి అమ్మ‌తున్నారు. సాధారణంగా కిలో మటన్‌కు రూ.550లు ఉండేది. కాని లాక్‌డౌన్ కార‌ణంగా రూ.750కి పెరిగింది. దీంతో మ‌ట‌న్ కొనుగోలు చేసేందుకు స్తోమ‌త లేని నిరుపేద‌, పేద‌, సామ‌న్య జ‌నాలు చికెన్ దుకాణాల వైపు మళ్లుతున్నారు. కాని చికెన్ వ్యాపారులు సైతం ధ‌ర‌లు పెంచి అమ్ముతున్నారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో ఎదుగుదల కోళ్లనూ విక్రయించడం, కొందరు కరోనా భయంతో కోళ్ల పెంపకాలు ఆపడం, మరికొందరు విరామం ప్రకటించడం వంటి పరిణామాలతో రానున్న కాలంలో చికెన్‌ కొరత తీవ్రంగా ఏర్పడనుంది. అందులోనూ చికెన్‌కు కరోనా వైరస్‌ లేదని, చికెన్‌ తినడంతో ఎలాంటి నష్టంలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండటంతో వినియోగదారుల్లో కరోనా భయం తగ్గుతుంది. ఇలాంటి పరిణామాలతో చికెన్‌ ధరలు గణనీయంగా పెరిగిపోయే అవకాశాలుంటాయని ట్రేడర్స్‌ అంచనా వేస్తున్నారు.

Tags : chicken rates, high, nalgonda, cm kcr announcement, coronavirus



Next Story

Most Viewed