వందకే కిలో.. వండకే చికెన్!

by  |
వందకే కిలో.. వండకే చికెన్!
X

కోడి కూర తింటే కరోనా సోకి ప్రాణాలు పోతాయన్న ప్రచారంతో జనాలు అటు చూసేందుకే మొగ్గు చూపట్లేదు. మొన్నటి వరకు ఉదయం నుంచి రాత్రివరకు జనాలతో కిటకిటలాడిన చికెన్ షాపులు కరోనా వైరస్‌ భయంతో చాలాచోట్ల బోసిపోయి కపడుతున్నాయి. రూ.200 నుంచి 240 పలికినా ఎగబడి కొన్న చికెన్ ప్రియులు ఇప్పుడు ఎవైడ్ చేసేస్తున్నారు. చికెన్ అంటేనే ఏదో తినరానిదన్నట్లుగా ఫీలవుతూ మటన్, ఫిష్‌కు ప్రిపరెన్స్ ఇస్తున్నారు. దీంతో ఇన్నిరోజులపాటు ఆకాశాన్నంటిన కోడికూర ధర సగానికిపైగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో యజమానులు షాపుల ముందు కూర్చొని రూ.100, 80కే కిలో చికెన్ అంటూ పిలుస్తున్న పరిస్థితులు రావడం గమనార్హం. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టాల్లోకి మళ్లింది.

చికెన్ తింటే కరోనా సోకి ప్రాణాలు పోతాయని సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారానికి తెరలేపడంతో పౌల్ట్రీ పరిశ్రమ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బ్రాయిలర్, నాటుకోళ్లకు సంబంధించిన కొన్ని గలీజు ఫొటోలను వైరల్ చేయడంతో జనాలు జంకుతున్నారు. వీటన్నింటికి తోడు చైనాలో కరోనాతో చనిపోతున్నారు, వేలాది మంది అనారోగ్యం బారినపడ్డారని టీవీల్లో వస్తుండటంతో ప్రజలు నిజమేనన్న భ్రమలోకి వెళ్లి బయటకు రాలేక పోతున్నారు. చికెన్‌తో కరోనా రాదని చెప్పినప్పటికీ పలు ప్రాంతాల్లో జనాలు చికెన్‌ వండేందుకు భయపడుతున్నారు. దీనికి తోడు ఏపీలో కోళ్లకు కొత్త వైరస్ సోకుతోందని ఇప్పటివరకు 30 వేల కోళ్లు చనిపోయాయని ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 50 శాతానికిపైగా అమ్మకాలు పడిపోయాయి. ఈ ప్రభావం మొత్తం పౌల్ట్రీ పరిశ్రమపై పడి యజమానులు చుక్కలు చూస్తున్నారు.

ఇటు మార్కెట్లో చికెన్ ధర భారీగా పడిపోవడాన్ని క్యాచ్ చేసుకున్న మటన్, ఫిష్ వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. గత ఆదివారం వరకు రూ.550 నుంచి 600 వరకు పలికిన కిలో మటన్ ధర ఇప్పుడు రూ.730 నుంచి రూ.750 పలుకుతోంది. అటు చేపలు (బొచ్చె, రవ్వ) కూడా గతవారం రూ.180 నుంచి 200 వరకు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు 300 వరకు రేటు పెంచి విక్రయిస్తున్నారు. డిమాండ్ భారీగా పెరగడంతో ఎలాగైనా తీసుకెళ్తారన్న ధీమాతో ఇష్టం ఉంటే తీసుకెళ్లండి లేకుంటే లేదన్నట్లుగా దబాయించి మాట్లాడుతున్నారు. మరోవైపు పట్టణాల్లో వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తూ చికెన్‌ను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలో చికెన్ రూ.100 పెట్టి తీసుకుంటే 15 కోడిగుడ్లు ఫ్రీ అంటూ కస్టమర్స్‌కు ఆఫర్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల రెండు కిలోల వరకు ఉన్న కోడి మొత్తం రూ.100 అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ చికెన్‌పై పడటంతో అటు పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రియులు నర్వస్‌గా ఫీలవుతున్నారు.

Read also..

‘నాలక్ష్యం.. మీ ఇళ్ల నుంచి డాక్టర్లు, కలెక్టర్లు రావాలి’


Next Story

Most Viewed