'నాలక్ష్యం.. మీ ఇళ్ల నుంచి డాక్టర్లు, కలెక్టర్లు రావాలి'

by  |
నాలక్ష్యం.. మీ ఇళ్ల నుంచి డాక్టర్లు, కలెక్టర్లు రావాలి
X

చదువుల విప్లవాన్ని ప్రారంభించానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరంలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని అన్నారు. పేదల బతుకుల్లో మార్పులు రావాలంటే వారిళ్ల నుంచి ఒక ఇంజనీర్ లేదా ఒక డాక్టర్ కాకుంటే ఐఏఎస్ అదీ కాకుంటే ఐపీఎస్ కావాలని పిలుపునిచ్చారు. ఇంటర్ తరువాత పైచదువులు ఇండియాలో కేవలం 23 శాతం మంది మాత్రమే చదువుతుంటే.. రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైన్ దేశాలలో 50 శాతం మంది చదువుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదల బతుకులెలా మారుతాయని ఆయన ప్రశ్నించారు.

అందుకే విద్యవిప్లవాన్ని ప్రారంభించానని జగన్ చెప్పారు. ఆర్థిక కారణాలతో ఏ వ్యక్తి విద్యను ఆపకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. జగనన్న వసతి దీవెన కింద 2,300 కోట్ల రూపాయలు 1.83 లక్షల మంది విద్యార్థులకు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మరో 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. కేవలం విద్యార్థుల విద్యకోసం ఏటా 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు.

మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 45 వేల పాఠశాలల దశదిశలను మార్చబోతున్నామని ఆయన చెప్పారు. అమ్మ ఒడి పథకానికి 6,400 కోట్లు ఖర్చుచేశామని ఆయన తెలిపారు. 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు. విద్య అభ్యసించే ఏ ఒక్క పేద విద్యార్థి కూడా పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద విద్యార్థుల భోజనం, వసతి సౌకర్యాలకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి ఈ పథకానికి రూపకల్పన చేశామని ఆయన చెప్పారు.

ఈ పథకం వల్ల విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గే వీలుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేలు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద చెల్లిస్తామని అన్నారు. ఇందు కోసం ప్రతి విద్యార్థికి యూనిక్‌ బార్‌ కోడ్‌తో కూడిన స్మార్డ్‌ కార్డులను వలంటీర్ల ద్వారా జారీ చేస్తామని చెప్పారు. ఆ కార్డులో సదరు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయని ఆయన తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల వరకు ఉన్న ప్రతి విద్యార్థికీ ఈ పథకం అందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వైయస్సార్‌ నవశకం సర్వే ద్వారా అర్హులను గుర్తించామని ఆయన వెల్లడించారు. గత ఏడాది నవంబరులో 11,27,437 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించగా, వారిలో 10,85,218 మంది విద్యార్థులు ఈ రెండు పథకాలకు అర్హులుగా తేల్చారు. సర్వే సమయంలో కొత్తగా 69,085 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో కూడా మరికొంతమంది అర్హులను గుర్తించారు. నేపథ్యంలో ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ పథకాల కోసం రాష్ట్రంలో 11,54,303 మంది విద్యార్థులు అర్హులని తేలింది. అయితే స్పందనలో వస్తున్న దరఖాస్తులు, అనర్హులుగా గుర్తించిన వారి అభ్యంతరాలు, గ్రామ సచివాలయాల్లో వలంటీర్ల సర్వే.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అనంతరం ‘జగనన్న వసతి దీవెన’ పథకం లబ్దిదారులుగా 11,87,904 మంది విద్యార్థులను గుర్తించడం జరిగింది.

జగనన్న వసతి దీవెన పథకం తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు, 86,896 మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులకు.. డిగ్రీ, పీజీ విద్యార్థులు మరో 10,47,288 మందికి ఆర్థిక సహాయం అందనుంది. ఐటీఐ విద్యార్థులకు తొలి విడతగా 5 వేల రూపాయల చొప్పున, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.7,500 చొప్పున, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1139.15 కోట్లు వారి వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.

కోర్సుల పరంగా చూస్తే..

ఐటీఐ విద్యార్థుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 6828, ఆ తర్వాత విశాఖ జిల్లాలో 6802 మంది ఉండగా, అత్యల్పంగా నెల్లూరులో 2057, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 2627 మంది విద్యార్థులు ఉన్నారు.
పాలిటెక్నిక్‌ విద్యార్థులు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 14,903, ఆ తర్వాత విశాఖ జిల్లాలో 12,197 మంది ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2826, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 3334 మంది విద్యార్థులున్నారు.
ఇక డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థులలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,22,219, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 1,08,139 మంది ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51,373, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 52,944 మంది విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థుల పరంగా చూస్తే మాత్రం..

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,31,899 మంది ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 57,270 మంది విద్యార్థులు, విజయనగరంలో 59,688, విశాఖలో 1,05,709, తూర్పు గోదావరిలో 1,23,938, పశ్చిమ గోదావరిలో 86,816, కృష్ణాలో 1,19,197, గుంటూరులో 1,19,618, ప్రకాశంలో 70,128, నెల్లూరులో 67,541, అనంతపురంలో 85,041, కడపలో 78,595, కర్నూలులో 82,464 మంది విద్యార్థులు ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.

Read Also..

మళ్లీ తెర మీదకు ‘ఛాయ్‌వాలా’

Next Story