హిడ్మాకు హుస్నాబాద్‌తో లింకు.. ఆయన ఈయనేనా..?

by  |
హిడ్మాకు హుస్నాబాద్‌తో లింకు.. ఆయన ఈయనేనా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : 2015 సంవత్సరంలో హుస్నాబాద్ సమీపంలో టన్నెల్ నిర్మాణానికి కూలీల వేషంలో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కొంతమంది వచ్చారు. వీరంతా అక్కడ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో పోలీసులు ఓ కీలక సమాచారం అందుకున్నారు. కూలీల వేషంలో అండర్ టన్నెల్ వద్ద మావోయిస్టులు వచ్చారని. వారి గురించి వాకబు చేస్తున్న క్రమంలో ఈ విషయం మావోయిస్టులకు లీకయింది. వారు తప్పించుకుంటన్న క్రమంలో కొంతమంది జారుకున్నారు. ఒకరు మాత్రం దొరికారు. సుక్మా జిల్లాకు చెందిన తన పేరు మసాకీ ఎడ్మా అని పోలీసుల విచారణలో చెప్పాడు. అతని నుండి పూర్తి వివరాలు సేకరించడానికి పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆదివాసీల మాతృభాషలో మాట్లాడడంతో అర్థం కాక పోలీసులు ట్రాన్స్ లేషన్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. అతను మాత్రం మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడని తేలడంతో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ముందు మావోయిస్టు పార్టీ సానుభూతి పరునిగా భావించినప్పటికీ అతని వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో దొరికిన వీడియోలు చూసి పోలీసులు షాకయ్యారు. మావోయిస్టులు రెక్కి నిర్వహించిన వీడియోలతో పాటు, రెక్కిలు చేస్తున్న వీడియోలు కూడా అందులో లభ్యం అయ్యాయి. కానీ అతని కేడర్ కనుక్కోలేకపోయారు. అప్పటికే యాక్షన్ టీంలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నట్టుగా మాత్రం పోలీసులు భావించి అరెస్ట్ చేశారు. బెయిల్ పై వచ్చిన తరువాత ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయాడు.

ఎడ్మానే హిడ్మానా..?

‘మసాకీ ఎడ్మా’గా నాడు పోలీసులు భావించిన వ్యక్తే ‘హిడ్మా’నా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతను చెప్పిన పేరు అర్థం కాకపోయి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటికే దండకారణ్యంలో పలు ఘటనలకు పాల్పడి సంచలనాలకు తెరలేపిన హిడ్మా వ్యూహాత్మకంగానే హుస్నాబాద్ ప్రాంతంలో కూలీల వేషంలో వచ్చి వెల్లి ఉంటాడని భావించారు. ఆ తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ఇక్కడి నుండి తిరిగి చత్తీస్ ఘఢ్ వెల్లిపోయిన తరువాత హిడ్మా పార్టీ నిర్మాణంలో కీలకంగా పనిచేసి మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా మారిపోయాడు.

Next Story

Most Viewed