ఐపీఎస్‌పై దేశద్రోహం కేసు

by  |
ఐపీఎస్‌పై దేశద్రోహం కేసు
X

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో తొలిసారి ఒక ఐపీఎస్ అధికారిపై దేశద్రోహం కేసు నమోదైంది. బహుశా దేశంలోనూ ఇదే తొలి కేసుగా భావిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఆయన కుట్రలు చేశారన్న ఆరోపణలతో ఐపీఎస్ జీపీ సింగ్‌పై రాష్ట్ర పోలీసులే స్వయంగా సెడిషన్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఇది దేశంలోనే సంచలనంగా మారింది. 1994 బ్యాచ్ అధికారి జీపీ సింగ్ ఏసీబీకి ఏడీజీ, రాయ్‌పూర్ ఐజీగానూ సేవలందించారు. రాష్ట్ర పోలీసు ట్రెయినింగ్ అకాడమీ హెడ్‌గా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన 15 ప్రాంతాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈవోడబ్ల్యూ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. జీపీ సింగ్ రూ. 10 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు గర్తించామని, బినామీల ద్వారా ఈ మొత్తాన్ని సంపాదించినట్టు ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత జీపీ సింగ్‌పై సస్పెన్షన్ వేటుపడింది. రాయ్‌పూర్‌లోని తన అధికారిక నివాసంలో తనిఖీలు చేస్తున్నప్పుడు కొన్ని కీలక దస్త్రాలు తమ కంటబడ్డాయని అధికారులు తెలిపారు. ఇంటి వెనుక ప్రాంతంలో చింపిన కాగితం ముక్కలు కనిపించాయని, వాటిని ఏరికూర్చితే విస్మయకర వ్యాఖ్యలు కనిపించాయని వివరించారు. ప్రజా ప్రతినిధులు, అభ్యర్థుల గురించి రహస్య విశ్లేషణలు ఆ డాక్యుమెంట్లలో ఉన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. మత, కుల ఆధారంగా వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచిపోషించే కుట్రలు, చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వంపై వ్యతిరేకతను కల్పించే వ్యాఖ్యానాలు అందులో ఉన్నాయని తెలిపారు. చట్టబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ విధానాలు, ప్రణాళికల పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించిందని వివరించారు. ఈ అభియోగాలతోనే ఐపీఎస్ జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.

నాకు ప్రాణహాని

రాష్ట్ర పోలీసులందరూ తనపై పక్షపాతంతో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తు్న్నారని ఐపీఎస్ జీపీ సింగ్ చత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ, ఈవోడబ్ల్యూలతో కాదు, సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలని, తద్వారా విచారణ పారదర్శకంగా ఉంటుందని అభ్యర్థించారు. తాను కోర్టును ఆశ్రయించడానికి ప్రధాన కారణం తనకు ప్రాణహాని ఉన్నదని, తానే తప్పూ చేయలేదని, అందుకే ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని తాను అభ్యర్థించడం లేదని, సీబీఐతో దర్యాప్తును కోరుతున్నారని వివరించారు. ఐపీఎస్ జీపీ సింగ్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ జీపీ సింగ్ కోర్టులో పిటిషన్ వేస్తే అందులో తమనూ భాగస్వామ్యం చేయాలని కోరుతూ పిటిషన్ వేయడం గమనార్హం.

Next Story

Most Viewed