కవిత కోసమే ఆ ఎంపీని రాజీనామా చేయించారు.. చెరుకు సుధాకర్

by  |
sudhakar
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప‌ట్టెడ‌న్నం పెట్టాలంటే పుట్టెడు వ‌డ్లు కొనాలి క‌దా! మరీ కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ద్వంద వైఖరీని అవలంభిస్తున్నాయో చెప్పాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టడం రాజ్యానికి ఉన్న రాజ్యంగ బాధ్యత అన్నారు. రైతులు పండించిన పంటను ఎవ‌రు కొనాలో చెప్పక క‌ల్లంలోనే రైతులు గుండె ప‌గిలి చ‌నిపోయే స్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని ఆరోపించారు. రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు కాక అల్లల్లాడుతున్న రైతుల ద‌గ్గర‌కు పోయి ధాన్యం అవ‌స్థకు కేసీఆర్ వైఖ‌రే కార‌ణ‌మ‌ని బీజేపీ.. మోడీ ప్రభుత్వమే కార‌ణ‌మ‌ని టీఆర్‌ఎస్ బాహాబాహీగా త‌ల‌ప‌డుతుంటే నెత్తి ప‌ట్టుకు కూర్చోవడం రైతుల వంతైందని ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు తప్పా కొనుగోళ్లపై పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు.

ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలను బంగారు తెలంగాణ అధిప‌త్య కులాల‌కు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి పంచి బీసీల‌కు, ఉద్యమ‌కారుల‌కు కేసీఆర్ మొండిచేయి చూపాడని ఆరోపించారు. రైతుల‌ను వ‌రివేస్తే కేసులు పెడ‌తాన‌న్న సిద్దిపేట క‌లెక్టర్ వెంక‌ట్రామ్‌రెడ్డిని ఆగమేఘాల మీద రాజీనామా చేయించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడని దుయ్యబట్టారు. అవినీతికి, అహంకారానికి కేరాఫ్‌గా ఉన్న వెంక‌ట్రామ్‌రెడ్డి రాజీనామా ఆమోదించి, ప‌ద‌వి క‌ట్టబెట్టడానికి 24 గంట‌లు కూడా ప‌ట్టలేదని, ఆయన రాజీనామాను తిరస్కరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కవిత కోసమే ఎంపీ పదవికి బండ ప్రకాశ్‌ను రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయించారని ఆరోపించారు. ఒక్క బీసీని కౌన్సిల్‌కు పంపినా, పంపకపోయిన ప్రతిప‌క్షాల ఆచ‌ర‌ణ కూడా ఇంత‌కు భిన్నంగా లేనందున రాష్ట్రంలో బ‌హుజ‌నులు రాజ‌కీయాల్లో అనాస‌క్తిని చూపుతున్నారన్నారు. తెలంగాణాలో ఉద్యమ‌, సామాజిక శ‌క్తులు ప్రజావ్యతిరేక‌, ఆధిప‌త్య వ‌ర్గాల‌కు పెద్దపీట వేసే అధికార పార్టీని, భిన్నంగా లేని ప్రతిప‌క్షాల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


Next Story

Most Viewed