దుబ్బాకలో టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ 

by  |
దుబ్బాకలో టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ 
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు, టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తన తండ్రికి, తనకు కూడా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పిన ఉత్తమ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాస్‌తో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ తండ్రి ముత్యంరెడ్డి ఆదర్శ నాయకుడని, దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. దుబ్బాక ఉపఎన్నిక.. తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని, ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. – ఉత్తమ్

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఉత్తమ్ మండిపడ్డారు. ఆయన మంగళవారం వెబ్ సమావేశంలో నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో టీఆర్ఎస్ రాజకీయాలను కలుషితం చేసిందని, దోచుకున్న సొమ్మును దుబ్బాకలో పంచుతుందని ఆరోపించారు. డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరుగలేదని, సోనియా అనుమతితో రేపు అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డిని ప్రకటిస్తామని వెల్లడించారు. రేపటి నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరం దుబ్బాకలోనే ఉంటామని, కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి.. – భట్టి

దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నేతలందరూ కృషి చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కీలకమని, నేతలందరూ ఓటు నమోదును సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం డబ్బులు కొల్లగొట్టాలని చూస్తోందని, డబ్బులు చెల్లించవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.

పక్కా ప్రణాళిక: ఎంపీ కోమటిరెడ్డి

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. దౌల్తాబాద్ మండలంలో 8వ తేదీన ఘనంగా మీటింగ్ నిర్వహించనున్నామని, బేషజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 2023 ఎన్నికలకు దుబ్బాక ఎన్నిక నాందిగా మారుతుందన్నారు.

Next Story

Most Viewed