నా తండ్రి ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యం

by  |
నా తండ్రి ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యం
X

దిశ, దుబ్బాక :
దుబ్బాక నియోజకవర్గం వివక్షకు గురవుతోందని.. ఇక్కడి నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలని తన తండ్రి ముత్యంరెడ్డి ఆరాటపడేవారని, అందులో బాగంగానే సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్తే కనీసం అపాయింట్‎మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. తన తండ్రి ముత్యంరెడ్డికి, తనకు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని వెల్లగక్కారు. 2018 ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు స్వయంగా వచ్చి తన తండ్రిని రామలింగారెడ్డికి సపోర్ట్ చేయాలని.. ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికి గెలిచిన తర్వాత కనీసం తమను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నమ్మించి మోసం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దిట్ట అన్నారు. తామేదో సంపాదించుకోడానికి రాజకీయంలోకి రావడం లేదని.. తన తండ్రి 35ఏళ్ల రాజకీయ చరిత్రలో సంపాదన కోసం ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదన్నారు. ఎల్లప్పుడూ దుబ్బాక అభివృద్ధి కోసమే ఆలోచించిన నాయకులు స్వర్గీయ ముత్యంరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసమే ఈ ఉప ఎన్నికల్లో తను పోటీ చేస్తున్నానని.. ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోరారు.


Next Story

Most Viewed