ఎమ్మెల్సీ కవిత పేరుతో ఘరానా మోసం..

by  |
ఎమ్మెల్సీ కవిత పేరుతో ఘరానా మోసం..
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పర్సనల్ గా కలిసి మాట్లాడాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందరి ద్వారానో ప్రయత్నాలు చేస్తే తప్ప ఆమెతో మాట్లాడే అవకాశం దక్కదు. కొన్నిసార్లు మాట్లాడే అవకాశం కూడా దక్కక పోవచ్చు. అలాంటిది ఎమ్మెల్సీ కవితకు తాము చాలా దగ్గరగా ఉంటాం. ఆమెతో పర్సనల్ గా మాట్లాడటానికి ఇదిగో ఈ వాకిటాకీ వాడు. నువ్వు ఫలానా ఛానల్ చైర్మన్ అయ్యావు. ఎమ్మెల్సీ కవిత నిన్ను ఛానల్ కు చైర్మన్ ను చేసింది అని ఆమె ఫొటోతో ఓ సర్టిఫికెట్ ఇస్తే నిజమే అనుకుంటాం. ఇక నా తలరాత మారింది అని వాళ్లకు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధమవుతాం. సరిగ్గా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగు చూసింది.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన మహమ్మద్.. అలియాస్ స్వామి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. చదువు పెద్దగా లేకపోవడంతో దువాకత్తర్ లో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే స్వామికి యూట్యూబ్ ఛానల్ లో పని చేసే వినోద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ద్వారా మహేష్ గౌడ్ అనే మరో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు స్వామికి బాగా నమ్మకస్థునిగా పరిచయం అయ్యాడు. దువాకత్తర్ లో పని చేస్తున్న మహమ్మద్ అలియాస్ స్వామితో మహేష్ గౌడ్ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు. ‘అక్కడ ఉండి ఎంత సంపాదిస్తావు, ఇండియాకు వచ్చేయు. 3

ఎమ్మెల్సీ కవిత మాకు బాగా పరిచయం. నిన్ను ఓ ఛానల్ కు చైర్మన్ ను చేపిస్తాం. తద్వారా రాయల్ లైఫ్ ఉంటుంది.’ అని నమ్మించాడు. నిజమేనని నమ్మిన బాధితుడు గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇండియాకు వచ్చాడు. అతడు రాగానే నువ్వు దువాకత్తర్ నుంచి వచ్చావని ఎమ్మెల్సీ కవిత నీకు శాలువా పంపించిందని ఇచ్చారు. నిన్ను ఛానల్ కు చైర్మన్ గా నియమించారు అంటూ ఎమ్మెల్సీ కవిత ఫోటోతో పాటు బాధితుని ఫొటోలతో కూడిన సర్టిఫికెట్ అందజేశారు. అలాగే కామారెడ్డిలో ఒకటి, వేములవాడలో ఒకటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వచ్చాయని వాటికి సంబంధించిన తాళాలను కూడా ఇచ్చారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కవితక్కతో పర్సనల్ గా మాట్లాడవచ్చని చిన్న వాకిటాకీ అందజేశారు. దానికి సంబంధించిన సామాగ్రిని బాధితునికి ఇచ్చారు.

దాంతో బాధితుడు నా అంత అదృష్టవంతుడు లేడని సంబరపడిపోయాడు. ఇవన్నీ ఇచ్చి అతడి వద్ద ఇద్దరు కలిసి ఛానల్ కోసం 2 లక్షలు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం నాలుగు లక్షలు, ఐడి కార్డు కోసం 50 వేలు మొత్తం ఆరున్నర లక్షలు దండుకున్నారు. కొద్దిరోజులకు ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందింది.. టౌన్ ఎస్సై శేఖర్

మహమ్మద్ అనే వ్యక్తి మాకు ఫిర్యాదు చేశాడు. మహేష్ గౌడ్, వినోద్ అనే ఇద్దరు వ్యక్తులు ఛానల్ ఇప్పిస్తామని రెండు లక్షలు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు నాలుగు లక్షలు తీసుకున్నారని, ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత డైరెక్టర్ గా ఛానల్ కు సంబందించిన సర్టిఫికెట్, వాకిటాకీ బాధితునికి ఇచ్చారు. న్యూస్ 9 కు సంబందించిన ఐడి కార్డు కూడా ఇచినట్టుగా బాధితుడు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు.


Next Story

Most Viewed