తగ్గిన అక్రమ రవాణా.. వణుకు పుట్టిస్తున్న చర్ల ఎమ్మార్వో

by  |
తగ్గిన అక్రమ రవాణా.. వణుకు పుట్టిస్తున్న చర్ల ఎమ్మార్వో
X

దిశ, భద్రాచలం: చర్ల తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఈరెల్లి నాగేశ్వరరావు అక్రమార్కుల పాలిట చండ శాసనుడులా తయారయ్యారు. ఆయన రాకముందు చర్లలో ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమంగా రవాణా చేసే వారిదే ఇష్టారాజ్యం.‌ అనుమతిలేని తోలకం ద్వారా అధిక లాభార్జనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు రెండు, మూడు ట్రాక్టర్లు మెయింటైన్ చేసిన సందర్భాలు లేకపోలేదు. నాలుగైదు వందలకు లభించిన ఇసుక రెండు వేలు చేశారు. ఈ రకమైన దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తహశీల్దార్‌గా నాగేశ్వరరావు వచ్చాక అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేశారని చెప్పవచ్చు. ఇసుక, గ్రావెల్, మట్టి తోలకాలపై క్రింది స్థాయి సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చి నిఘా తీవ్రతరం చేశారు.‌ దీంతో రెవెన్యూ సిబ్బంది రేయింబవళ్ళు రోడ్లపైకి వచ్చి కాపలా కాస్తున్నారు. పట్టుకున్న ప్రతి ఇసుక ట్రాక్టర్ వదలకుండా తహశీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నారు. అంతేగాకుండా చర్ల సంత నుంచి వ్యాపారులు పశువులను నిబంధనలు పాటించకుండా హైదరాబాద్ తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అట్టి పశువుల రవాణా నిలుపుదల చేశారు.‌

నాడు సందడి… నేడు బోసిపోయి…

ఇంతకు ముందు భూముల పట్టాల మార్పిడి, నకిలీ ఎస్‌సి, ఎస్‌టి, బీసీ కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయం, వారసత్వ, ఏజెన్సీ సర్టిఫికేట్ల కోసం వచ్చే పైరవీకారులతో తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణం నిత్యం రద్దీగా ఉండేది. ఇపుడు నిబంధనల మేరకే సర్టిఫికేట్లు జారీ చేస్తామని ఖరాఖండిగా చెప్పడమే కాకుండా.. అర్హతలేని వాటిని తిరస్కరిస్తుండటంతో చర్ల ఎమ్మార్వో ఆఫీసు బోసిపోయి కనిపిస్తోంది. అమ్మో.. ఈ తహశీల్దార్ ఉండగా ఎలాంటి సర్టిఫికేట్లకు దరఖాస్తు చేయవద్దని అక్రమార్కులు తెగ భయపడుతున్నారు. చర్లలో ప్రతినెలా లక్షలాది రూపాయల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తూ పైరవీలు చేసి తెల్ల రేషన్‌కార్డులు పొందినవారంతా తమ కార్డులు ఉంటాయా, ఊడుతాయా అని భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సందర్భంగా దొడ్డిదారిన పట్టాలు పొందిన వారి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఈ విషయంలో ఓవైపు అక్రమార్కులు, మరోవైపు ముడుపులు తీసుకొని సహకరించిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు సైతం తహశీల్దార్ ఏమి చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చినవారు, పొందిన వాళ్ళు గడగడ వణికిపోతున్నారు. ఆయన ఏ ఫైల్ ముడితే ఏమౌతుందో అనే భయం అందరిలో నెలకొంది.

ధాన్యం వ్యాపారుల దోపిడీపై దృష్టి పెట్టాలి

ఖరీఫ్ వరి సాగుకి పెట్టుబడి పెట్టామనే వంకతో దళారీ ధాన్యం వ్యాపారులు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోలు సందర్భంగా ధర, పడికట్టు తూకంతో మోసం చేసే అవకాశాలు ఉన్నాయని వరి పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో కోట్లాది రూపాయల ధాన్యం కొనుగోళ్ళు ప్రైవేటుగా జరుగుతాయి. చర్ల మండలంలో అనేకరకాల అక్రమాలకు చెక్ పెట్టిన కొత్త తహశీల్దార్ నాగేశ్వరరావు.. దళారీ ధాన్యం వ్యాపారులను కట్టడిచేసి మేలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇలాంటి అధికారి హయాంలోనే దళారీల మోసాలకు ముగింపు పలకాలని రైతులు ఆశిస్తున్నారు.



Next Story

Most Viewed