ఏపీకి బాబొచ్చారు.. ఊపు తెచ్చారు

by  |
Chandrababu
X

దిశ ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఆంధప్రదేశ్ చేరుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా చంద్రబాబునాయుడు హైదరాబాదులోని నివాసానికే పరిమితమయ్యారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రయాణాలకు అనుమతులు మంజూరు చేస్తుండడంతో ఆయన ఏపీ డీజీపీకి దరఖాస్తు చేశారు.

వాస్తవానికి బాబు షెడ్యూల్ ప్రకారం హైదరాబాదు నుంచి విమానంలో నేరుగా వైజాగ్ రావాల్సి ఉంది. ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలోని నివాసంలో ఉంటూ, ఈ నెల 27, 28వ తేదీల్లో జరుగనున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, విమానాశ్రయాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టేందుకు మరొక రోజు సమయం కావాలంటూ ఏపీ ప్రభుత్వం విమాయాన శాఖను కోరడంతో ఏపీకి విమానాలు ఒక రోజు ఆలస్యంగా చేరనున్నాయి. దీంతో హైదరాబాదు నుంచి వైజాగ్ రావాల్సిన బాబు తన పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

దీంతో ఆయన రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చేరారు. ఇక్కడ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న రాజధాని పోరాటానికి ఆయన మద్దతు ఇవ్వనున్నారు. అలాగే ప్రస్తుతం ఏపీలో అలజడి రేపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్థక ఆస్తుల వేలంపై గొంతెత్తనున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహానాడు వేడుకల్లో భాగంగా మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు. అనంతరం పరిస్థితులకు అనుగుణంగా ఎల్జీపాలిమర్స్ బాధితులను పరామర్శిస్తారు. దీంతో ఏపీ రాజకీయాల్లో విపక్షాలకు కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed