అఖిలప్రియ అరెస్ట్.. బాబు సైలెంట్.. వై??

by  |
అఖిలప్రియ అరెస్ట్.. బాబు సైలెంట్.. వై??
X

దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కనీసం ఏ ఒక్క టీడీపీ నేత స్పందించకపోవడానికి కారణమేంటి? అదునుచూసి మాట్లాడాలని అనుకుంటున్నారా.. లేకుంటే పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయా? తల్లిదండ్రులు లేని ఓ మహిళా నేత చంచల్‌గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే ఎందుకు రెస్పాండ్ కావట్లేదు. టీడీపీలో అఖిలప్రియను పక్కన పెట్టారా? లేకుంటే ఇటీవల జరిగిన పరిణామాలతో తనే పార్టీకి దూరమైందా! అసలు ఏం జరిగింది? చంద్రబాబు ఇంత సైలెంట్ కావడానికి రీజన్ ఏంటి.. వాచ్ దిస్ స్టోరీ!

హైదరాబాద్ నడిబొడ్డున 50 ఎకరాల ల్యాండ్‌ ఇష్యూలో సీఎం కేసీఆర్ బంధువును కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో బుధవారం టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేశారు. రాత్రివరకు పోలీస్ స్టేషన్, వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రి, తర్వాత కోర్టుకు అక్కడి నుంచి మళ్లీ బేగంపేట మహిళా పీఎస్.. చివరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే అఖిలప్రియ అరెస్ట్ అయినప్పటి నుంచి మీడియాలో హడావుడి జరుగుతున్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఏమాత్రం స్పందించకపోవడం పట్ల టీడీపీతో పాటు వైసీపీలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. భూమా నాగిరెడ్డి మరణాంతరం అఖిలప్రియకు మంత్రి పదవి దక్కగా, ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన చంద్రబాబు.. తల్లిదండ్రులు లేని అఖిలప్రియకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కానీ చంద్రబాబు, లోకేశ్‌తో పాటు ఏ చిన్న టీడీపీ నేత సైతం అఖిలప్రియ అరెస్ట్‌ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పలేదు. కనీసం ప్రకటనలు విడుదల చేసిన దాఖలాలు లేవు. మొన్నటివరకు ట్విట్టర్, వీడియో కాన్పరెన్స్‌ ద్వారా జనాలకు సందేశం పంపించిన చంద్రబాబు, లోకేశ్.. నిన్నటి నుంచి సోషల్ మీడియాలోనూ గప్‌ చుప్‌గా ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ, అనుచరుల వ్యవహారం నచ్చకనే ఆమెను పార్టీకి దూరంగా ఉంచారని, అందుకే అఖిలప్రియ అరెస్ట్ విషయంలో మౌనం వహిస్తూ, పార్టీ నేతలకు కూడా ఆదేశాలు జారీ చేయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో కోడెల శివప్రసాద్ విషయంలోనూ చంద్రబాబు చివరివరకు ఇదే ధోరణిని అవలంభించి విమర్శలు మూటగట్టుకున్నారన్న వాదన సోషల్‌ మీడియాలో నడుస్తోంది.

అయితే ఏవీ సుబ్బారెడ్డితో గల వివాదాన్ని టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అదే తీరున వ్యవహరిస్తుండటంతో అఖిలప్రియనే దూరంగా ఉందన్న కామెంట్లు వినపడుతున్నాయి. తల్లి శోభానాగిరెడ్డి మరణం తర్వాత, తండ్రితో కలిసి టీడీపీలో చేరడంతో ఇప్పుడు వైసీపీ కూడా స్పందించడం లేదని, అందుకే.. అఖిల ప్రియ కుటుంబ సభ్యులే ఒకరిద్దరు మీడియాతో మాట్లాడారని అంటున్నారు. మరోవైపు అఖిలప్రియ అరెస్ట్ జరిగింది హైదరాబాద్‌లో.. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో చంద్రబాబుకు సత్సంబధాలు లేకపోవడం, పైగా కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయడంతో సైలెంట్‌గా ఉంటున్నారన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

అఖిలప్రియ అరెస్ట్‌ తర్వాత అన్ని విషయాలను క్షుణ్ణంగా గమనించిన వైసీపీ నేతలు.. గురువారం మధ్యాహ్నం మీడియాలో స్పందించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అఖిలప్రియ అరెస్ట్ అయితే ఎందుకు స్పందించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించినా.. టీడీపీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed