ప్రధాని కిటికీలు తెరిస్తే.. సీఎం ద్వారాలే తెరిచారు

by  |
ప్రధాని కిటికీలు తెరిస్తే.. సీఎం ద్వారాలే తెరిచారు
X

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో :

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కొంత వెసులుబాటు కోసం కిటికీలు తెరిస్తే.. సీఎం కేసీఆర్ ఏకంగా ద్వారాలే తెరిచాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఒక చేతితో డబ్బులు ఇచ్చి.. మద్యం అమ్మకాల ద్వారా మరో చేత్తో వెనక్కి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఖజానా నింపుకునేందుకే వైన్ షాపులు ఓపెన్ చేసిన ప్రభుత్వం.. ప్రజల యోగక్షేమాలను గాలికొదిలేసిందన్నారు. రెడ్, ఆరెంజ్ ,గ్రీన్ జోన్లలో మద్యం షాపులు తెరిచి, లాక్‌డౌన్ అమలు చేసినా ప్రయోజనం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజల ఆవేదను తమ గొంతుకుల ద్వారా వినిపిస్తాయని అన్నారు.

కరోనా పట్ల ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కరోనా గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ.. ‘పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని, ఎండలు బాగా కొడితే కరోనా ప్రజల దరికి చేరదన్నారని’ గుర్తుచేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో నియంత్రించేందుకే పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించారన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గముఖం పట్టకముందే వైన్ షాపులకు సడలింపులివ్వడం కేసీఆర్ అనాలోచిత నిర్ణయమని అన్నారు.

Tags: CPI, Venkatreddy, Modi, KCR, liquor shops, corona, opposition

Next Story

Most Viewed