వీసాల అనుమతులు నిలిపేసిన భారత్ !

by  |
వీసాల అనుమతులు నిలిపేసిన భారత్ !
X

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు మంజూరు చేసిన అన్ని రకాల వీసా అనుమతులను మంగళవారం నుంచి నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన కారణంగా కొన్ని వీసాలకు మాత్రం మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా దేశంలో చిక్కుకొని పోయిన విదేశీయుల వీసాలను మాత్రమే పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ప్రవాస భారతీయులకు మంజూరు చేసిన లైఫ్‌లాంగ్ మల్టిపుల్ ఎంట్రీ వీసాలను కూడా నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియాలో ఈ వీసాపై ఉంటున్నవారు ఎన్ని రోజులైనా ఉండొచ్చని.. దేశం విడిచి వెళ్లిన తర్వాత మాత్రం తిరిగి రాకూడదని పేర్కొంది.

విదేశీయులకిచ్చిన వీసా మినహాయింపుల గడువు, అంతర్జాతీయ విమానాల రాకపోకలు మొదలైన తర్వాత 30 రోజుల వరకే ఉంటుందని.. ఆలోపుగా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక దౌత్య, ఐక్యరాజ్యసమితి, ఉపాధి, ప్రాజెక్టుల వీసాలపై వచ్చిన వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. కొత్తగా మరెవరికీ ఏ వీసా కూడా మంజూరు చేయమని హోం శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అత్యవసరమని భావించే వీసాలను మాత్రం పరిశీలన అనంతరం మంజూరు చేయాలా వద్దా అనే విషయం నిర్ణయిస్తామన్నారు.

Tags: Home Ministry, Visa, Cancel, India, coronavirus, Foreigners


Next Story