వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపాలి: శివసేన

by  |
వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపాలి: శివసేన
X

ముంబై: లాక్‌డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శివసేన పార్టీ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నాలోని సంపాదకీయంలో ఈ అంశాన్ని ప్రస్థావించింది. కరోనా హాట్ స్పాట్‌గా గుర్తించిన ధారావీలో అనేకమంది వలస కూలీలున్నారనీ, వారు తమ సొంతూళ్లకు చేరుకునేలా రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసే బాధ్యత కేంద్రానిదేనని వెల్లడించింది. వారంతా ఇలాగే వీధుల్లోకి వస్తుంటే, పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది. గుజరాత్‌కు చెందిన పర్యాటకులు హరిద్వార్‌లో చిక్కుకున్నప్పుడు వారిని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్రం ఎలాంటి చొరవ చూపిందో.. వలస కూలీలను సొంతూళ్లకు చేర్చడానికీ అలాంటి చొరవే చూపాలని కోరింది. ఇంటికి దూరంగా ఉన్నామనే ఆవేశంతో వారంతా వీధుల్లో గుమిగూడితే ఎదురయ్యే పరిస్థితిని అంచనా వేయలేమని తెలిపింది. అలాగే, మహారాష్ట్రలో కొన్ని పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం వలస జీవులను రెచ్చగొడుతున్నాయని పేర్కొంది.

Tags: migrant workers, shiv sena, mumbai, maharastra, centre, saamana, lockdown, dharavi, corona

Next Story

Most Viewed