ఏప్రిల్ 20 తర్వాత ఇంకొన్ని సడలింపులు

by  |
ఏప్రిల్ 20 తర్వాత ఇంకొన్ని సడలింపులు
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కొన్ని సేవలకు మినహాయింపులనిచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయ పనులు, కొన్ని పారిశ్రామిక కార్యకలాపాలకు సడలింపులనిచ్చింది. కంటైన్‌మెంట్ జోన్‌లు మినహా ఇతర ఏరియాల్లో ఈ అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తాజాగా, వీటికి అదనంగా మరికొన్నింటికి సడలింపులనిస్తూ సూచనలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణపనులకు మినహాయింపులనిచ్చింది. టింబర్ మినహా ఇతర అటవీ ఉత్పత్తులకు గిరిజనులకు అకాశమిచ్చింది. కొబ్బరి, వెదురు, పలురకాల సుగంధ ద్రవ్యాల సాగు, ప్రాసెసింగ్‌కూ అనుమతులనిచ్చినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు సూచనలు జారీ చేశారు. వీటితోపాటు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్‌లను అత్యవసర సేవలుగా గుర్తించడంతో ఇవి 20వ తేదీ తర్వాత కరోనా కేసులు ఎక్కువగా లేని ఏరియాల్లో అందుబాటులోకి వస్తాయి. కొబ్బరి, అటవీ ఉత్పత్తులకూ మినహాయింపులనిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, సానిటేషన్ నిర్మాణ పనులు, పవర్ లైన్స్, టెలికాం ఆప్టికల్ ఫైబర్స్, కేబుల్స్ వేయడంలాంటి పనులకు సడలింపులను సూచించింది.

నిన్న రాత్రి కూడా ఇటువంటి సడలింపులను కేంద్రం ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జీలు, ల్యాప్‌టాప్‌లు, విద్యార్థులకు బట్టలు, స్టేషనరీ వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. అయితే, ఇ-కామర్స్ డెలివరీ వ్యాన్‌లను రోడ్లపై నడిపేందుకు అధికారులను ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

Tags: lockdown, exemptions, april 20, services, rural areas, e commerce

Next Story

Most Viewed