కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయాలు

by  |
కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయాలు
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సోమవారం సమావేశమైన మంత్రి మండలి సంచలన నిర్ణయాలు తీసుకున్నది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలోపెట్టుకుని రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), వీధి వ్యాపారులను ఆదుకునే కీలక నిర్ణయాలను ఆమోదించింది. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, ప్రకాష్ జవడేకర్, నరేంద్ర తోమర్ మీడియాకు వివరించారు. గ్రామీణ ప్రజలు, పేదలు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర పెంచి వారిని ఆదుకోబోతున్నట్టు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను 150శాతం పెంచుతామన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు. ఇందులో భాగంగానే 14 రకాల ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధరను పెంచే నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. దీనితో రైతులు పెట్టిన ఖర్చుపై 50 శాతం నుంచి 83శాతం మేరకు తిరిగి లాభం పొందుతారని అన్నారు. క్వింటాల్ వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ. 53 పెంచింది. దీంతో 2020-21 క్రాప్ సంవత్సరంలో క్వింటాల్ వరి ధర రూ. 1,868కి చేరినట్టయింది. క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ. 260 పెంచింది. దీంతో క్వింటాల్ పత్తిధర రూ. 5,515కి పెరిగింది. అలాగే, రైతులు తమ రుణాలను చెల్లించే గడువును పెంచబోతున్నట్టు తెలిపారు. ఆగస్టులో తుది గడువు ఉంటుందని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై కొత్తగా రుణాలు తీసుకోవచ్చునని, తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే వీలును రైతులకు కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే, వీధి వ్యాపారుల కోసం రూ. 50,000 కోట్ల ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ కింద చెప్పులు కుట్టేవాళ్లు, సెలూన్ నిర్వాహకులు, వీధుల్లో తిరిగి ఉత్పత్తులు అమ్ముకునేవారు సహా వీధి వ్యాపారులు రూ. 10,000 రుణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా కనీసం 50 లక్షల వీధి వ్యాపారులు లబ్ది పొందవచ్చునని కేంద్రమంత్రులు తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు రూ. 20వేల కోట్లు:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కొత్తగా ప్రతిపాదించిన ఎంఎస్ఎంఈల నిర్వచనానికీ ఆమోదం తెలిపింది. ఆర్థికంగా చితికిపోయిన ఎంఎస్ఎంఈల కోసం రూ. 20,000 కోట్ల ప్యాకేజీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఈ ప్యాకేజీతో రెండు లక్షల యూనిట్లు లబ్ది పొందుతాయని వివరించారు. ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చేలా ఈక్విటీల కొనుగోళ్ల కోసం రూ. 50,000 కోట్లను వినియోగించబోతున్నట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈల కోసం డిస్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేసే ప్రతిపాదననూ ఆమోదించింది. రూ. 20,000 కోట్లతో ఈ ఫండ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫండ్ ద్వారా గరిష్టంగా రూ. 75 లక్షల రుణాన్ని(లేదా ఆ యూనిట్ మొత్తం పెట్టుబడుల్లో 15 శాతం మేరకు) ఎంఎస్ఎంఈ యూనిట్లు పొందవచ్చు. దీని ద్వారా రెండు లక్షల యూనిట్లు లబ్ది పొందనున్నాయి.

Next Story

Most Viewed