సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం తగదు : టీడీపీ

by  |
Jakkili Ilaiah
X

దిశ, చౌటుప్పల్: తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన నారాయణపురం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల వివాదం పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకోవడం కోసం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధానాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.

వివాదాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి కాని ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకోవడమంటే రాష్ట్రాల హక్కులను హరించడమేనని విమర్శించారు. రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టుపై కేంద్రం అజమాయిషీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని, వెంటనే గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కుక్కల నరసింహ, టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్పుల సుదర్శన్, నాయకులు ముత్యాల విజయ్ కుమార్, బద్దుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed