ప్రభుత్వం తీరుపై కేంద్రం సీరియస్ : ఎంపీ సీఎం రమేష్

by  |
ప్రభుత్వం తీరుపై కేంద్రం సీరియస్ : ఎంపీ సీఎం రమేష్
X

దిశ, విశాఖపట్నం : రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దాడుల నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందని, ఇప్పటి వరకు ఉపేక్షిచామని,ఇక ఊరుకునే పరిస్థితి ఉండదని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. రామతీర్ధ పర్యటనకు వెళ్తున్న సీఎం రమేష్‌, మాజీ మంత్రలు కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణ రెడ్డిలను విశాఖ బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిచారు కదా.. నేనే దేవుడ్ని అనే ధోరణిలో సీఎం జగన్‌ ఉన్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న విషయంపై నేటికి కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. రామతీర్ధ ఘటనపై ప్రభుత్వం వేసిన సీఐడీ విచారణ పై తమకు నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆయా విచారణ కమిటీ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను అడ్డుకోవడానికి సెక్షన్ 30 తీసుకొస్తే.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కేంద్రం చేతిలో 356 అధికరణ ఉందని మర్చిపోవద్దని జగన్ సర్కారును హెచ్చరించారు. హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే మంత్రుల మాట్లాడేతీరు బాధకరంగా ఉందని, ఇది సరైనది కాదన్నారు.

చలో రామతీర్ధ యాత్రకు బయల్దేరిన బీజేపీ నేతలు సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయనగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని అక్కడికి వెళ్ళ కూడదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాము విధ్వంసాలు చేయమని రాతపూర్వకంగా రాసి ఇస్తామని పోలీసులకు సీఎం రమేష్‌ రాసి ఇస్తామని చెప్పినప్పటికీ పోలీసులు ససేమేరా అన్నారు. దీంతో ఉన్నతాధికారులు వచ్చేంత వరకు కార్లోనే కూర్చుంటానని పోలీసులకు బీజేపీ నేతలు చెప్పారు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.

Next Story

Most Viewed