థర్డ్‌ వేవ్‌పై కేంద్రం ఆందోళన.. లైట్ అంటున్న ప్రజలు

by  |
Covid third wave
X

న్యూఢిల్లీ: ప్రజల్లో కరోనా పట్ల సీరియస్‌నెస్ లేదని, థర్డ్ వేవ్‌ వార్నింగ్‌ను కేవలం ఓ వాతావరణ అప్డేట్‌గా మాత్రమే ట్రీట్ చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై మీడియా బ్రీఫింగ్‌లో భాగంగా ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మే నెల 5నుంచి 11 వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 3,87,029గా ఉండగా, అది ఈ నెల 7 నుంచి 13 మధ్య 40,841కి పడిపోయిందని తెలిపారు. కేసులు తగ్గుతున్నంత మాత్రానా కరోనా తగ్గుతున్నదనుకోవడం పొరపాటని, థర్డ్ వేవ్‌ ముప్పు పొంచి ఉన్నదని వెల్లడించారు.

అయితే, థర్డ్‌‌ వేవ్ హెచ్చరికలను ప్రజలు పట్టించుకోవడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ నెలలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచే 73.4శాతం రిపోర్ట్ అయ్యాయని చెప్పారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, అస్సాం సహా 11 రాష్ట్రాలు/యూటీల్లో రోజువారీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సదరు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపనున్నట్టు వెల్లడించారు.

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో థర్డ్ వేవ్: వీకే పాల్

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, అది మనదేశం దాకా వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ప్రధాని మోడీ చెప్పినట్టు.. దేశంలోకి కరోనా ఎప్పుడొస్తుందనే దానిపై చర్చకు బదులు, అది రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించాలని సూచించారు.

Next Story