రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. మద్దతు ధర పెంపు!

by  |
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. మద్దతు ధర పెంపు!
X

న్యూఢిల్లీ : సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించే రబీ పంటల ఉత్పత్తుల కనీస మద్దతు ధర (MSP)లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఆరు పంటల ఎంఎస్పీలను పెంచుతున్నట్టు కేంద్ర కేబినెట్ వెల్లడించింది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. క్వింటాల్ గోధుమలపై రూ.40 పెంచింది. దీంతో క్వింటాల్ గోధుమల ధర రూ.2,015కు చేరింది. గోధుమల ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ.1,008గా అంచనా వేసింది.

అలాగే, క్వింటాల్ ఆవాలపై రూ.400 పెంచి, మొత్తం ధరను 5,050గా నిర్ణయించింది. కాగా, గోధుమలపై పెంచిన ఎంఎస్పీ ఈ దశాబ్దంలోనే అతి తక్కువ కావడం గమనార్హం. ఇక బార్లీపై రూ.35 పెంచుతూ, క్వింటాల్ ధరను రూ.1,635గా తెలిపింది. శనగపప్పుపై ఎంఎస్‌పీని రూ.130 పెంచి, క్వింటాల్ ధర రూ.5,230గా నిర్ణయించింది. పెసలు, ఉలవలు వంటి పప్పుల ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.400 పెంచి, రూ.5,500గా నిర్ణయించింది. క్వింటాలు కుసుమలపై రూ.114 పెంచి, రూ.5,327గా నిర్ణయించింది. ‘రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండేలా 2022-23 రబీ మార్కెటింగ్ సీజన్‌(RMS)లో రబీ పంటల ఎంఎస్‌పీని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల ప్రకారం, ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. తాజా, సమావేశంలో ఆరు పంటలకు ఎంఎస్పీని ప్రకటించింది.

2022-23 మార్కెటింగ్ సీజన్ కోసం నిర్ణయించిన రబీ పంటల MSPలు(క్వింటాల్‌కు రూపాయలలో) :

పంట ఆర్ఎంఎస్ 2022-23కు MSP (ఉత్పత్తి వ్యయం) ఎంఎస్పీ పెంపు

గోధుమ రూ.2,015 రూ.1,008 రూ.40
బార్లీ రూ.1,635 రూ.1,019 రూ.35
శనగపప్పు రూ.5,230 రూ.3,004 రూ.130
పెసలు, ఉలవలు రూ.5,500 రూ.3,079 రూ.400
ఆవాలు రూ.5,050 రూ.2,523 రూ.400
కుసుమలు రూ.5,441 రూ.3,627 రూ.114


Next Story

Most Viewed