మిడతల దండుతో జాగ్రత్త: కేంద్రం

by  |
మిడతల దండుతో జాగ్రత్త: కేంద్రం
X

దిశ, న్యూస్ బ్యూరో: మిడతల దండుతో తలెత్తే ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ కంటింజెన్సీ ప్రణాళికను పంపింది. ప్రత్యేకంగా క్రిమి సంహారక మందుల్ని పిచికారి చేయడానికి బ్రిటన్ నుంచి మానవ రహిత విమానాల తరహా ఉపకరణాలను, డ్రోన్‌లను సమకూర్చుకుంటోంది. లక్షల సంఖ్యలో మిడతలు దండెత్తుతున్నాయని, ఒక్క చదరపు కిలోమీటర్ పరిధిలో అది పంటలను తినే మోతాదు 35 వేల మంది మనుషులకు సరిపోయేంత స్థాయిలో ఉంటుందని కేంద్ర ఆహార, వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆ కంటింజెన్సీ ప్లాన్‌లో పేర్కొనింది. బ్రిటన్ నుంచి ‘మైక్రోనెయిర్’ రకం పరికరాలు 21, ఉల్వమాస్ట్ రకం స్ప్రేయర్లు 26 సమకూర్చుకుంటున్నామని, పది రోజుల్లో అవి అందుతాయని మంత్రిత్వశాఖ పేర్కొనింది. వివిధ రాష్ట్రాల్లో మితడల దండును తరిమికొట్టడానికి ఏయే రకాల క్రిమిసంహారక మందుల్ని వాడాలో, ఏ మోతాదులో నిల్వ ఉంచుకోవాలో రాష్ట్రాలకు ఆ ప్లాన్‌లో సూచించింది. ప్రత్యేకంగా డ్రోన్‌లను, మానవ రహిత విమానాలను వాడుకోడానికి పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

ప్రస్తుతం మన దేశంలో తిరుగుతున్న మిడతల దండులో డిజర్ట్, మైగ్రేటరీ, బాంబే, ట్రీ అనే నాలుగు రకాలవి ఉన్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. మైక్రోనెయిర్ రకం పరికరాలు ఒక రోజుకు సగటున 200 హెక్టార్ల మీద మందులను పిచికారీ చేయగలుగుతుందని, ఉల్వమాస్ట్ అనేది మాత్రం 125 హెక్టార్లను కవర్ చేస్తుందని తెలిపారు. మలాథియాన్ (96% సాంద్రత) కనీసంగా 5 వేల లీటర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. దీనికి తోడు క్లోరో ఫైరిఫాస్ (20% సాంద్రత), ఫెనిట్రోథిన్, డైల్ట్రిన్ (18% గాఢత) తదితరాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. గతంలో మిడతల దండు దాడిచేసిన అనుభవం లేని రాష్ట్రాలు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారుల నెంబర్లను ఆ ప్లాన్‌లో పొందుపరిచింది. వీటి తీవ్రతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంలోని హోం, రక్షణ, ఎర్త్ సైన్సెస్, పౌర విమానయానం, కమ్యూనికేషన్ తదితర మంత్రిత్వశాఖల సేవలను కూడా వినియోగించుకునేలా ఒక సమన్వయ వ్యవస్థను నెలకొల్పినట్లు తెలిపింది.

అయితే ఇలాంటి మందులను పిచికారి చేసిన తర్వాత పశువులను మేతకు పంపకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రైతులు సైతం అలాంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించింది. ఇదిలా ఉండగా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కూడిమ కమిటీని నియమించడంతో పాటు పలు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పెద్దపల్లి జిల్లా రామగుండంలో జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. రెండు మూడు రోజుల పాటు పొరుగు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ మిడతల దండు కదలికలను కనిపెడుతూ గోదావరి నదీ తీరం వెంట హెలికాప్టర్‌లో పర్యటించనుంది.


Next Story

Most Viewed