డీపీఆర్‌లపై దొందు దొందే

by  |
డీపీఆర్‌లపై దొందు దొందే
X

దిశ, న్యూస్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో డీపీఆర్‌ అంశం రగులుతూనే ఉంది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలివ్వాలని ఐదేండ్ల నుంచి కేంద్రం అడుగుతున్నా రెండు రాష్ట్రాలు దాటవేస్తూనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన రెండు బోర్డుల సమావేశాల్లో ఇదే అంశంపై ప్రధాన చర్చగా మారింది. గోదావరి బోర్డు పరిధిలోని ప్రాజెక్టుల వివరాలు ఈ నెల 10లోగా, కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈ నెల 9లోగా ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఇస్తామని అంగీకరించిన ఇరురాష్ర్టాల అధికారులు తర్వాత వాటి విషయమే పట్టించుకోవడం లేదు.

మీ ప్రాజెక్టుల వివరాలివ్వండి

రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వకపోవడంతో గోదావరి, కృష్ణా బోర్డు చైర్మన్లు ప్రాజెక్టుల వారీగా వివరాలివ్వాలంటూ తాజాగా ఇరు రాష్ట్రాల ప్రాజెక్టు సీఈలకు లేఖలు పంపించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలంటూ సూచించారు. వెంటనే ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకోవాలని సమాధానం ఇవ్వాలని సూచించారు.

డీపీఆర్‌లు తీసుకోవాల్సిందే

కేంద్రం రెండు బోర్డులపై ఒత్తిడి పెంచింది. ఇరు రాష్ట్రాలను నదీ జలాల అంశంలో ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే జల వివాదాలు, నీటి వాడకం అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. కృష్ణా ప్రాజెక్టుపై ఏపీ రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడ్​ ప్రవాహ సామర్థ్యం పెంపు కోసం జీవో జారీ చేయడంతో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఏపీ గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే బోర్డు సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటి ఉంటుందని కేంద్రం సమాచారమిచ్చింది. దీనికోసం వివరాలు పంపించాలని ఆదేశాలిచ్చారు.

కేంద్రానికి చిక్కకుండా..

ఇంటర్ లింక్ ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రం రెండు రాష్ట్రాల జల వివాదాలను సాకుగా చూపిస్తుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే మిగులు, వరద జలాలు, రెండు రాష్ట్రాల నీటి వినియోగం వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే కేంద్రం చేతిల్లోకి వెళ్లకుండా రెండు రాష్ట్రాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గోదావరి, కృష్ణా బోర్డులపై ఉన్న ప్రాజెక్టు వివరాలు, డీపీఆర్‌లు ఇవ్వకుండా కాలయాపన చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే రెండు బోర్డులు నిర్ణీత గడువు విధించినా ఒక్క ప్రాజెక్టు వివరాలు కూడా సమర్పించ లేదు. ప్రాజెక్టుల నుంచి కూడా ఒక్క సమాచారం కూడా ఇవ్వరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.

Next Story

Most Viewed