Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి.. అసలు విషయం చెప్పిన కేంద్రం

by  |
Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి.. అసలు విషయం చెప్పిన కేంద్రం
X

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్నవారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకొసిస్)ను అంటువ్యాధిగా ప్రకటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంటువ్యాధిగా ప్రకటించడానికి బ్లాక్ ఫంగస్‌ను ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద నోటిఫై చేయాల్సి ఉంటుంది. బ్లాక్ ఫంగస్ కేసులు, అనుమానిత కేసులనూ ఆరోగ్య శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లను ఆదేశించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఓ లేఖలో తెలిపారు. వాటిని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రాజెక్ట్ సిస్టమ్‌లో ఎంటర్ చేయాలని వివరించారు.

బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు బహుళ విధాల చికిత్స అవసరమవుతుందని, కంటి సర్జన్లు, ఈఎన్‌టీ స్పెషలిస్టులు, జనరల్ సర్జన్, న్యూరో సర్జన్, డెంటల్ సర్జన్ల సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. యాంటీఫంగల్ మెడిసిన్ ఎంఫోటెరిసిన్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఎపిడెమిక్ చట్టం ద్వారా వ్యాధిని కట్టడి చేయడానికి అధికారులకు ప్రత్యేకాధికారాలు సంక్రమిస్తాయి. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రూపొందించిన మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

స్టెరాయిడ్ థెరపీ చేసుకున్నవారు, షుగర్ కంట్రోల్ తప్పిన కరోనా పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు తెలుపుతున్నారు. మహారాష్ట్రలో 1500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వగా, 90 మంది మరణించారు. రాజస్తాన్‌లోనూ వందకుపైగా కేసులున్నాయి. కేంద్రం ఆదేశాలకు ముందే రాజస్తాన్‌ బుధవారమే బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించగా, తెలంగాణ గురువారం నోటిఫై చేసింది.

Next Story