సిక్కోలు వైసీపీలో లొల్లి.. అలిగిన కేంద్ర మాజీ మంత్రి

by  |
ycp killi kruparani
X

దిశ, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలుగొందారు. ఓటమెరుగని ఎర్రన్నాయుడిని ఓడించి రికార్డు సృష్టించారు. అంతేకాదు కేంద్రమంత్రిగా పనిచేసి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా.? ఇంకెవరు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.

ప్రస్తుతం ఆమె రాజకీయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అధికార పార్టీలో ఉన్నప్పటికీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకంటూ చిన్నవాళ్లు.. ఇటీవలే రాజకీయాల్లో అరంగేట్రం చేసిన వారు జిల్లా రాజకీయాలను ఏలుతుంటే తాను మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందే అని మదనపడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను రాజ్యసభకు పంపుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది.

అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతున్నా ఇంకా ఎలాంటి పదవి కట్టబెట్టలేదు. బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళా నేతగా, విద్యావంతురాలిగా, వైద్యురాలిగా కిల్లి కృపారాణికి మంచి పేరు ఉంది. జిల్లాలో దిగ్గజ నేత, ఓటమెరుగని నేత అయిన ఎర్రన్నాయుడుని ఆమె 2009 ఎన్నికల్లో ఓడించారు. అలాంటి కృపారాణి వైసీపీలోకి వచ్చినా జగన్ సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న అసంతృప్తి ఆమెలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు పంపుతాను అన్న హామీ ఇప్పటికీ నెరవేర్చకపోవడం పట్ల మనస్థాపం చెందినట్లు సమాచారం. అందువల్లే ఆమె సైలెంట్‌గా ఉంటున్నారని ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. మరి సీఎం జగన్ ఆమెను ఎలా సంతృప్తిపరుస్తారో అన్నది వేచి చూడాలి.



Next Story

Most Viewed