చెరువులో శ్మశానవాటిక.. అంత్యక్రియలకు ఈత కొట్టాల్సిందే..!

by  |
చెరువులో శ్మశానవాటిక.. అంత్యక్రియలకు ఈత కొట్టాల్సిందే..!
X

దిశ, కామారెడ్డి: ప్రతి గ్రామంలో మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మించింది. ప్రభుత్వ స్థలాల్లో దాదాపు అన్ని గ్రామాలలో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. అయితే స్థలాల ఎంపికలో మాత్రం నిబంధనలు పాటించినట్టు లేదు. కొన్ని గ్రామాల్లో చెరువు స్థలాల్లో వైకుంఠదామాలు నిర్మించారు. ఫలితంగా ఆ వైకుంఠ దామాలు ప్రస్తుతం కురిసిన వర్షాలకు నీటిలో మునిగిపోయాయి. చెరువు నీటిలో నుంచే వైకుంఠ దామంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే చెరువు స్థలాల్లో నిర్మాణాలకు కారణమని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు.

గత నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో దాదాపు అన్ని గ్రామాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే చెరువు స్థలంలోనే నిర్మించిన వైకుంఠదామాలు కూడా అందులోనే ఉండిపోయాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ దామాల్లోకి వెళ్లాలంటే చెరువు నీటిలో మునిగి తేలుతూ వెళ్లాల్సిందే. మృతదేహాన్ని తీసుకుని ఆ నీటినుంచే వైకుంఠ దామం లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దారిలో గుంతలు ఏమైనా ఉంటే జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ పలువురు నెటిజన్లు ఈ ఫొటోలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే, చెరువులో వైకుంఠ దామాలు నిర్మించిన ఆ ప్రజాప్రతినిధులు, బిల్లులు మంజూరు చేసిన అధికారులు ప్రజల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి..


Next Story