స్మార్ట్ ధామం.. పార్కును తలపిస్తున్న శ్మశాన వాటిక

by  |
స్మార్ట్ ధామం.. పార్కును తలపిస్తున్న శ్మశాన వాటిక
X

దిశ, కరీంనగర్ సిటీ : స్మార్ట్ రోడ్లు, స్మార్ట్ పార్కులు, స్మార్ట్ మార్కెట్స్, స్మార్ట్ టాయిలెట్స్ ఇలా స్మార్ట్ సిటీలో రోడ్ల నుంచి మొదలు పబ్లిక్ టాయిలెట్ల వరకు ప్రతీది ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్న నగర పాలక సంస్థ వైకుంఠధామాలను కూడా అదే స్థాయిలో ఆధునీకరిస్తుంది. మానేరు నది తీరాన ఉన్న శ్మశాన వాటికను ఆధునీకరించి అన్ని హంగులు కల్పించింది. ఇతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వాటికి ధీటుగా సకల సౌకర్యాలు కల్పించగా త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు బల్దియా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రూ.10.20 కోట్లతో నగరంలోని ప్రధాన పార్కులను తలదన్నేలా నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనేక రకాల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. మూడు మోడ్రన్ బర్నింగ్ ప్లాట్ ఫామ్ తోపాటు, రెండు వెయిటింగ్ హాళ్లు, చితాభస్మం నిల్వ గదులు ఏర్పాటు చేశారు. నీటి వసతి, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు, ఖర్మకాండలకు ప్రత్యేక స్థలం కేటాయించారు. శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు పనులు కొనసాగుతుండగా, అంతర్గత నిర్మాణాలన్ని ఇప్పటికే పూర్తయ్యాయి.

ప్రధాన ద్వారంతోపాటు మిగతా మైదానంలో గ్రీనరీ ఏర్పాటు చేయగా ఆకర్షణీయంగా మారింది. వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్, శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాటిక చుట్టూ నిర్మించిన రోడ్లు, వాటికి ఇరువైపులా నాటిన మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన రోడ్డు నుంచి శ్మశానవాటిక వైపు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాల్సి ఉంది. తీగల వంతెన రోడ్డు పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ దారి పనుల్లో కొంచెం జాప్యం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీనితోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శ్మశాన వాటికలు, సిక్కుల, క్రిస్టియన్ ల ఖనన వాటికలు, ఖబరస్తాన్​కూడా అభివృద్ధి చేసేందుకు నగర పాలక సంస్థ యంత్రాగం పనులు కొనసాగిస్తోంది.

Next Story