ఓ పట్టు పట్టారు.. ఒప్పించారు

by  |
protest
X

దిశ, (చేవెళ్ల): పెద్ద పెద్ద వాహనాలు రోజుల తరబడి వెళ్లడంతో రోడ్లన్నీ గుంతలమయం. వానాకాలం వచ్చిదంటే చాలు, అడుగు బయట పెట్టలేని దుస్థితి. దీనికి కారణం ఓ పేరు మోసిన సిమెంట్ కంపెనీ. ఎన్నిసార్లు రోడ్లు బాగు చేయండని మొర పెట్టుకున్న లాభం లేకపోయింది. ఇలా ఎన్ని రోజులు ఇలా ఉండాలనుకున్నారో ఏమో? ఊరంతా ఏకమై సిమెంట్ కంపెనీ ముందు మెరుపు ధర్నా చేపట్టారు. అంతే దెబ్బకు దిగివచ్చింది యాజమాన్యం. పాడై పోయిన రోడ్‌ను తిరిగి బాగు చేస్తామని ప్రకటించింది. ఇది రావులపల్లి కలాన్ గ్రామస్తుల సాధించిన విజయం.

వికారాబాద్ రోడ్ నుంచి రావులపల్లి కలాన్ గ్రామానికి వెళ్లే రోడ్డు బాగు చేయించాలని గ్రామస్తులు ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. సిమెంట్ కంపెనీకి చెందిన భారీ వాహనాలు రోడ్డుపై తిరుగుతుండటంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు, కాలినడకన వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కంపెనీ ప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, మంగళవారం హఠాత్తుగా ధర్నాకు దిగినట్లు గ్రామస్తులు తెలిపారు.

దీంతో రావులపల్లి కలాన్ గ్రామస్తులు వార్డు మెంబర్లు కిష్టయ్య గౌడ్, ఎం శ్రీనివాస్, హెచ్. విష్ణు, జె. ప్రసాద్, ఎం. రాములు తదితరులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పావనిహనుమంత్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, శంకర్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, శంకర్‌పల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కంపెనీ జనరల్ మేనేజర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ధర్నా చేస్తున్న స్థలానికి వచ్చారు. గ్రామస్థులతో మాట్లాడారు. రోడ్డు సమస్య తీర్చాలని గ్రామస్తులు పట్టుపట్టడంతో రోడ్డు వేసేందుకు ఒప్పుకుంటున్నట్లు జనరల్ మేనేజర్ గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.

Next Story